అరేయ్ బుజ్జీ.. అన్నా హజారే ముఖచిత్రం ఏంటో..?
Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం కనిపించింది. ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్లా విజయఢంకా మోగిస్తోన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మట్టికరిచింది. హస్తినాపురిలో తన ప్రాభవాన్ని, అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ బోణీ కొట్టే పరిస్థితీ కనిపించట్లేదు.
మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో తలి సారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరలేదా పార్టీ ఓటుబ్యాంక్. ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీనికి అనుగుణంగా ఫలితాలు వెలువడుతున్నాయి. క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది బీజేపీ.

ఇప్పటివరకు ఓడిన వారిలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్- న్యూఢిల్లీ, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా- జంగ్పురా, ధరంపాల్ చందేరా- రాజౌరీ గార్డెన్, సోమ్నాథ్ భారతి- మాలవీయ నగర్, ప్రవీణ్ జైన్- షాలిమార్ బాగ్, దినేష్ మొహానియా - సంగం విహార్ ఉన్నారు. ముఖ్యమంత్రి ఆతిషీ- చివరి రౌండ్లో గట్టెక్కారు. కల్యాజీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరీపై విజయఢంకా మోగించారు.
ఫలితాలు వెలువడుతున్న కొద్దీ బీజేపీలో జోష్ పెరిగింది. ఈ తెల్లవారు జాము నుంచే ఆ పార్టీ ఢిల్లీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. బాణాసంచా కాల్చారు. స్వీట్లను పంచిపెట్టారు. రంగులు చల్లుకున్నారు. డోలు వాయిస్తూ సందడి చేశారు. కాషాయ జెండాలను ఎగురవేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు జిందాబాద్ కొట్టారు. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో ఎక్కడపడితే అక్కడ బీజేపీ కార్యకర్తలు సందడి చేస్తూ కనిపించారు. రోడ్డుపై వెళ్లే వాహనదారులకూ స్వీట్లను పంచిపెట్టారు. కాషాయ కండువాలను మెడలో వేసుకుని బైక్లు, స్కూటీలపై విజయోత్సవ ర్యాలీలను సైతం నిర్వహించారు.
మరోవంక- ఆమ్ ఆద్మీ పార్టీలో దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించింది. మూగబోయిందా పార్టీ కార్యాలయం. బోసిగా కనిపించింది. ప్రాభవాన్ని కోల్పోయింది. అటు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం సైతం వద్దా ఇలాంటి వాతావరణమే నెలకొంది.
తొలుత- బాణసంచా, పార్టీ జెండాలతో ఆమ్ ఆద్మీ కేంద్ర కార్యాలయం, అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద కనిపించారు నాయకులు, కార్యకర్తలు. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ నిరాశ నిస్పృహలకు గురయ్యారు. కేజ్రీవాల్, ఆతిషీ, మనీష్ సిసోడియా వంటి హేమాహేమీలు సైతం వెనుకంజలో పడటంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేస్తోన్నప్పుడు అభ్యర్థికి వ్యక్తిత్వం, మంచి ఆలోచనలు ఉండాలని, ఆయన ఇమేజ్పై ఎటువంటి మచ్చ ఉండకూడదని తాను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నానని గుర్తు చేశారు. అప్పుడే ప్రజలు విశ్వసిస్తారని చెప్పారు.
ఆ విశ్వాసాన్ని ఆప్ పొందలేకపోయిందని అన్నా హజారే అన్నారు. మద్యం, డబ్బు ఆరోపణల్లో చిక్కుకుపోయారని వ్యాఖ్యానించారు. దాని వల్లే అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ దెబ్బతిన్నదని అన్నారు. ఆప్ అభ్యర్థుల ఓటమికి ఇదే ప్రధాన కారణమైందని విశ్లేషించారు.
కేజ్రీవాల్ ఎప్పుడూ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుంటాడే తప్ప దాన్ని ఆచరించబోడనేది ప్రజలు గుర్తించారని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు అనేవి అత్యంత సహజమని, వాటిలో తాను నిర్దోషినని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ నాయకుడిపైనే ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications