ఢిల్లీ బాంబు దాడి మా పనే... సోషల్ మీడియాలో ప్రకటించిన ఆ సంస్థ... అనుమానిస్తున్న దర్యాప్తు సంస్థలు..
దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో చోటు చేసుకున్న బాంబు పేలుడు తమ పనేనని జైష్ ఉల్ హింద్ అనే సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన స్కీన్ షాట్ టెలిగ్రామ్లో వైరల్గా మారింది. అయితే ఇలాంటి సంస్థ ఒకటి ఉన్నట్లుగా ఇప్పటివరకూ ఎన్నడూ తమ దృష్టికి రాలేదని... ఈ పేరే కొత్తగా వింటున్నామని అధికారులు అంటున్నారు. బహుశా దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకే సోషల్ మీడియాలో ఇలాంటి ప్రకటన చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
టెలీగ్రామ్లో వైరల్ అవుతున్న ఆ స్కీన్ షాట్లో.. 'సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దయ,సాయం ద్వారా జైష్-ఉల్-హింద్ సైనికులు ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంతంలోకి చొరబడి ఐఈడీ దాడి చేయగలిగారు. దేశంలోని ప్రధాన నగరాలపై వరుస దాడులు చేసేందుకు అల్లాహ్ సిద్దంగా ఉన్నాడు. భారత ప్రభుత్వం చేసిన దారుణాలకు ఈవిధంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. వేచి చూడండి... మేము కూడా వేచి చూస్తాము.' అని అందులో పేర్కొన్నారు.
ఈ పేలుడు ఘటనకు సంబంధించి శనివారం(జనవరి 30) పోలీసులు సంఘటనా స్థలంలో ఒక బ్యాటరీని స్వాధీనం చేసుకున్నారు. పేలుడు కోసం టైమర్ డివైజ్ను ఉపయోగించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కదులుతున్న కారు నుంచి ఈ ఐఈడీని విసిరేసి ఉంటారని భావిస్తున్నారు. ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థాన్ని చుట్టి దాన్ని పూలకుండీలో విసిరేసి ఉంటారని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. అందులో బాల్ బేరింగ్స్ కూడా ఉన్నట్లు గుర్తించారు.
సంఘటనా స్థలంలో సగం కాలిన పింక్ చున్నీని కూడా స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం(జనవరి 29) బీటింగ్ రీట్రీట్ జరిగిన విజయ్ చౌక్ ప్రాంతానికి పేలుడు సంభవించిన ప్రాంతం కేవలం 2కి.మీ దూరంలోనే ఉండటం గమనార్హం. అత్యంత భారీ భద్రత ఉండే ప్రాంతానికి అతి సమీపంలో ఈ పేలుడు సంభవించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మరోవైపు ఇదే పేలుడుకు సంబంధించి సంఘటనా స్థలంలో దర్యాప్తు సంస్థల అధికారులకు ఒక లేఖ దొరికినట్లు తెలుస్తోంది. అందులో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసీం సులేమానీ పేరును ప్రస్తావించడంతో ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు, 'ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే' అని లేఖలో రాసి వున్నట్లు గుర్తించారు.