ఢిల్లీలో ఇక వారాంతపు కర్ఫ్యూ- సమయాలివే- కోవిడ్, ఓమిక్రాన్ కేసుల కల్లోలమే కారణం
దేశ రాజధాని ఢిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న కరోనా వైరస్, ఓమిక్రాన్ వైరస్ కేసులు అక్కడి ప్రభుత్వం, అధికారుల్ని కంటిమిద కునుకులేకుండా చేస్తున్నాయి. స్వయంగా సీఎం కేజ్రివాల్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ ఉదయమే తనకు కరోనా సోకినట్లు ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఢిల్లీలో పరిస్ధితులు చేయిదాటి పోయేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలో శుక్రవారం రాత్రి 10 నుండి సోమవారం ఉదయం 5 గంటల వరకు వారాంతపు కర్ఫ్యూ విధించింది. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులందరూ "వర్క్ ఫ్రమ్ హోమ్" విధానానికి మారతారని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అత్యవసర సేవలు మినహా ఈ సమయాల్లో ఎవరినీ రోడ్లపై అనుమతించబోమని ప్రభుత్వం చెబుతోంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దీనిపై ఇవాళ ఓ ప్రకటన చేయబోతున్నారు. అలాగే ఓమిక్రాన్ ఉప్పెనకు ఆజ్యం పోసిన కోవిడ్ కేసుల పెరుగుదల మరింత ఎక్కువైతే మరిన్ని ఆంక్షలు కూడా తప్పకపోవచ్చని తెలుస్తోంది.

Recommended Video
ప్రస్తుతం దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో మహహారాష్ట్ర తర్వాత ఢిల్లీ రెండోస్ధానంలో ఉంది. ఇక్కడ కరోనా కేసులతో పాటు ఓమిక్రాన్ కేసుల తీవ్రత కూడా భారీగా పెరిగింది. ఢిల్లీలో నమోదవుతున్న ప్రతీ నాలుగైదు కేసుల్లో ఓ ఓమిక్రాన్ ఉంటోందని చెప్తున్నారు. దీంతో జనం ప్రాణాల్ని కాపాడుకోవాల్సిన పరిస్దితులు తలెత్తుతున్నాయి. అదే సమయంలో స్వయంగా ప్రభుత్వాధినేత అయిన సీఎం కేజ్రివాల్ కు కూడా కరోనా సోకడంతో ఇక సాధారణ ప్రజల పరిస్ధితి ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వం వెంటనే ఆంక్షల్ని అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతుండగా.. పగటి పూట కూడా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇక వారాంతపు కర్పూ కూడా మొదలైతే ఢిల్లీ అనధికారిక లాక్ డౌన్ లోకి వెళ్లినట్లేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications