కేజ్రీవాల్ సర్కారు యూటర్న్: సరి-బేసి విధానం నిలిపివేత
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కారు సరి-బేసి విధానం అమలుపై వెనక్కి తగ్గింది. విపరీతంగా పెరిగిపోయిన కాలుష్య నివారణకు ప్రవేశపెట్టిన సరి-బేసి విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం శనివారం పేర్కొంది. ఎన్జీటీ షరతుల వల్లే సరి-బేసి అమలు చేయడంలేదని పేర్కొంది.
మహిళలను, టూవీలర్స్ను కూడా సరి బేసి విధానం కిందకు తీసుకురావాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) తీర్పుపై సోమవారం మళ్లీ ట్రైబ్యునల్ను ఆశ్రయిస్తామని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రత రీత్యా వారిని సరి బేసి విధానం కిందకు తీసుకురావడం సరికాదని అభిప్రాయపడ్డారు.
కాగా, సరి-బేసి విధానంపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విధానం అంత సరైనది కాదని చెబుతూనే కొందరికి మినహాయింపు ఎందుకు కల్పించారని ప్రశ్నించింది. ఈ మేరకు శనివారం సుదీర్ఘ విచారణ చేపట్టిన ఎన్జీటీ చివరకు సరి-బేసికి ఒప్పుకొంది. అయితే మినహాయింపు అవసరం లేదని.. అందరికీ నిబంధనలు వర్తింపజేయాలని సూచించింది. అత్యవసర వాహనాలకు మాత్రమే మినహాయింపు ఇవ్వాలని సూచించింది.
కాలుష్యం లెవల్ 300 దాటితే తప్పనిసరిగా సరి- బేసి విధానం తీసుకురావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ అధ్యక్షతన శనివారం ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది. ఇందులో సరి-బేసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది.
'మహిళలు, ద్విచక్రవాహనాలకు మినహాయింపు ఇవ్వడాన్ని ఎన్జీటీ వ్యతిరేకించింది. ప్రస్తుతం మేం సరి-బేసి విధానాన్ని అమలు చేయట్లేదు. ఈ విషయమై సోమవారం నాడు ఎన్జీటీలో రివ్యూ పిటిషన్ వేస్తాం. ఆ తర్వాత ఎప్పుడు అమలు చేస్తామన్నది ప్రకటిస్తాం' అని కైలాశ్ గెహ్లాట్ తెలిపారు.