ట్విట్టర్ ఇండియా ఢిల్లీ, గుర్గావ్ కార్యాలయాల్లో స్పెషల్ పోలీసుల తనిఖీలు, నోటీసు
న్యూఢిల్లీ: ట్విట్టర్ ఇండియా కార్యాలయాల్లో ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు సోదాలు ప్రారంభించారు. సోమవారం ఢిల్లీ, గుర్గావ్ ప్రాంతాల్లో ఉన్న ట్విట్టర్ కార్యాలయానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు సోదాలు చేపట్టారు. ఢిల్లీలోని ల్యాడో సరాయిలో ఉన్న ట్విట్టర్ ప్రధాన కార్యాలయంతోపాటు దేశ రాజధాని శివార్లలో గుర్గావ్లో ఉన్న ట్విట్టర్ కార్యాలయంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
కోవిడ్ టూల్ కిట్ వ్యవహారంలో నోటీసులు పంపిన స్పెషల్ పోలీసుల బృందం వాస్తవాలు నిర్ధారించుకునేందుకు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్వీట్ను మనిప్యూలేటెడ్ మీడియా అంటూ ట్విట్టర్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, సంబిత్ పాత్ర ట్వీట్లోని సమాచారం కోవిడ్ టూల్ కిట్ గురించే కావడం గమనార్హం. దాన్ని ఇతర బీజేపీ నాయకులు కూడా పోస్టు చేశారు.
కరోనా నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఈ టూల్ కిట్ తయారు చేసిందని పాత్ర, ఇతర నేతలు ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా కాంగ్రెస్ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ఛైర్మన్ రోహన్ గుప్తా, ఇతర నాయకులు ట్విట్టర్ కు ఓ లేఖ పంపారు. ఈ ట్వీట్లు నకిలీ టూల్ కిట్ గురించి అని, ఇది కాంగ్రెస్ పార్టీకి తప్పుగా ఆపాందించబడిందని తెలిపారు.
కాగా, ఈ కేసు వ్యవహారంలో తమ బృందం ట్విట్టర్కు నోటీసులు పంపినట్లు స్పెషల్ సెల్ కు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. టూల్ కిట్ గురించి ట్విట్టర్ లో ఏ సమాచారం ఉందో, వారు మానిప్యులేటెడ్ మీడియా లేబుల్ ను ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.
తమ బృందం మెహ్రౌలిలోని ట్విట్టర్ ఢిల్లీ కార్యాలయం, గోల్ఫ్ కోర్సు రోడ్లోని గుర్గావ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. సాధారణ ప్రక్రియలో భాగంగానే ట్విట్టర్ కు నోటీసులు ఇచ్చేందుకు బృందం కార్యాలయానికి వెళ్లిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ట్విట్టర్ ఇండియా ఎండీ ఇచ్చిన సమాధానాలు చాలా అస్పష్టంగా ఉన్నాయని, అందుకే నోటీసు ఇవ్వడానికి సరైన వ్యక్తి ఎవరు? అని తాము తెలుసుకోవాలనుకున్నామని చెప్పారు.