కేజ్రీవాల్ వారికి బిర్యానీ పెడుతున్నారు.. అందుకే పాక్ మంత్రి మద్దతు: యోగీ ఆదిత్యనాథ్
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను ప్రచారం చేయడంపై నిషేధం విధించాలని ఈసీని డిమాండ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. తాజాగా మరోసారి సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు.
అరవింద్ కేజ్రీవాల్కు అనుకూలంగా పాకిస్తాన్ మంత్రి మాట్లడటాన్ని ఆయుధంగా మలుచుకున్నారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. అరవింద్ కేజ్రీవాల్కు పాకిస్తాన్ మంత్రి ఎందుకు మద్దతు పలుకుతున్నారు అని ప్రశ్నించిన యోగీ ఆదిత్యనాథ్... షాహీన్ బాగ్ నిరసనకారులకు ఒక్క కేజ్రీవాల్ మాత్రమే బిరియాని పెట్టగలరనే సంగతి తెలిసే మద్దతు పలికారని యోగీ విమర్శించారు. ఆదివారం ప్రచారం చేస్తూ యోగీ ఆదిత్యనాథ్ షాహీన్బాగ్ నిరసనలపై మాట్లాడారు. ఢిల్లీలోని ప్రశాంత వాతావరణంను చెడగొట్టాలనే ఉద్దేశంతోనే షాహీన్బాగ్ నిరసనలు చేపట్టారని యోగీ చెప్పడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్తర్ప్రదేశ్ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఓ వైపు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం, దేశంలో జరుగుతున్న అభివృద్ధి జాతీయ భావం ఉండగా మరో వైపు కాంగ్రెస్, కేజ్రీవాల్ ఉన్నారని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు. కాంగ్రెస్, కేజ్రీవాల్ రెండూ విభజన రాజకీయాలకు మద్దతు తెలిపేవారని యోగీ ఆదిత్యనాథ్ విమర్శించారు. ఉగ్రవాదం అణిచివేతకు బీజేపీ చర్యలు తీసుకుంటుండగా ... కేజ్రీవాల్ మాత్రం షాహీన్బాగ్ నిరసనకారులకు బిర్యానీ పెట్టే పనిలో బిజీగా ఉన్నారని సెటైర్ వేశారు.
Uttar Pradesh CM Yogi Adityanath in Delhi's Vikaspuri: Why a Pakistani minister is making statements in support of Arvind Kejriwal? Because he knows that only Kejriwal can feed biryani to protesters in Shaheen Bagh. #DelhiElections pic.twitter.com/AOVrQhHvfG
— ANI (@ANI) February 3, 2020
షాహాన్బాగ్ నిరసనలు ముందస్తు వ్యూహంతో జరిగినవే అని యోగీ ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దు, లేదా అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై నిరసనలు చేస్తే అర్థముంటుంది కానీ... వారు మాత్రం ట్రిపుల్ తలాక్పై నిరసనలు వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దుతో బాధపడింది ఒకరు పాకిస్తాన్ మరొకరు కేజ్రీవాల్ అని అన్నారు యోగీ ఆదిత్యనాథ్.