చలి-పులి: గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా పడిపోయిన ఢిల్లీ ఉష్ణోగ్రతలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. గత వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గత రెండు వారాల నుంచి ఢిల్లీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతూ వస్తున్నాయని ప్రస్తుతం ఢిల్లీ షిమ్లాను తలపిస్తోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇక సోమవారం రోజున గత వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సోమవారం రోజున గరిష్ట ఉష్ఱోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్గా రికార్డు అయ్యిందని చెప్పారు.
ఇక పగటి పూట వాతావరణం చాలా చల్లగా ఉంటుండగా రాత్రివేళల్లో ఎముకలు కొరికే చలి ఉంటోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇక డిసెంబర్ నెలకు గాను ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత సోమవారం రోజున నమోదైనట్లు చెప్పారు. 1901 నుంచి భారత వాతావరణ కేంద్రం ఉష్ణోగ్రతలను రికార్డు చేస్తోంది. అయానగర్ లో ఉన్న వాతావరణ కేంద్రం 7.8 డిగ్రీల సెల్సిషస్ టెంపరేచర్ను రికార్డు చేయగా రిడ్జ్లో 8.4 , పాలంలో 9, లోడిలో 9.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయని పేర్కొంది.
గత 22 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా దేశ రాజధానిలో చలి వణికిస్తోందని అధికారులు చెప్పారు. ఇక కనీస ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 14 నుంచి ఉష్ణోగ్రతలు ఇదే తరహాలో స్థిరంగా రికార్డు అవుతున్నట్లు వెదర్ డిపార్ట్మెంట్ చెబుతోంది. ఇదిలా ఉంటే సఫ్ధార్జంగ్లోని అధికారిక వాతావరణ కేంద్రం ఇస్తున్న లెక్కల ప్రకారం శనివారం రోజున 2.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సఫ్ధార్జంగ్ వాతావరణశాఖ ఇచ్చే ఉష్ణోగ్రతలే అధికారికంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక సగటున 3.4 డిగ్రీల సెల్సియస్ నమోదు అవుతుందని అధికారులు తెలిపారు.
సోమవారం రోజున ఢిల్లీ నగరాన్ని మంచు దుప్పటి కప్పేయడంతో చాలా విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్ని విమానాలను దారి మళ్లించగా మరికొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక ఢిల్లీలో పొగమంచు అలుముకోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. దారి కనిపించకపోవడంతో పలుచోట్ల వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి.