తెలంగాణ లిక్కర్ మాఫియాతో ఆ డిప్యూటీ సీఎంకు లింక్స్: హైదరాబాద్లో కీలక డీల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ అగ్ర నాయకుల నివాసాలపై దాడులకు దిగింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో సోదాలను నిర్వహిస్తోన్నారు సీబీఐ అధికారులు. ఆయనతో పాటు ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ నివాసంలోనూ ఏక కాలంలో దాడులు సాగిస్తోన్నారు. మొత్తంగా ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో 21 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు.
ఈ దాడులకు ప్రధాన కారణం.. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే ఆమోదించిన నూతన ఎక్సైజ్ పాలసీనే కారణం అనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ పాలసీని ఆమోదించడం వెనుక భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఫిర్యాదులు అందడం వల్ల దాడులు చేపటినట్లు సమాచారం. ఎక్సైజ్ పాలసీని లిక్కర్ మాఫియా ఒత్తిళ్ల మేరకు, వారికి అనుకూలంగా దీన్ని రూపొందించారనే విమర్శలను ఢిల్లీ ప్రభుత్వం ఎదుర్కొంటోంది.
దీన్ని బలపరిచేలా తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన పశ్చిమ ఢిల్లీ లోక్సభ సభ్యుడు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించిన ఎక్సైజ్ పాలసీకి- తెలంగాణకు లింకులు ఉన్నాయని బాంబు పేల్చారు. తెలంగాణ లిక్కర్ మాఫియాతో మనీష్ సిసోడియాకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారు. లిక్కర్ మాఫియాతో కాంట్రాక్ట్ను కుదుర్చుకోవడానికి మనీష్ సిసోడియా స్వయంగా తెలంగాణకు వెళ్లారని చెప్పారు.
అక్కడ ఏయే హోటళ్లు, రెస్టారెంట్లల్లో మనీష్ సిసోడియా, ఆయన అనుచరులు గదులను బుక్ చేసుకున్నారనే వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని పర్వేష్ వర్మ వివరించారు. వాటి ఆధారంగానే సీబీఐ తాజాగా ఈ దాడులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఇందులో 10-15 మంది ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బంది, మనీష్ సిసోడియాకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇందులో నుంచి ఆయన తప్పించుకోలేరని అన్నారు.
ఈ నెల 1వ తేదీ నుంచి ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో కొత్త మద్య విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది- ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో మద్యం అమ్మకాలను ప్రభుత్వం మాత్రమే చేపట్టేలా దీన్ని చర్యలు తీసుకుంది. ఇది దుర్వినియోగానికి గురైందంటూ ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఇటీవలే కొన్ని సోదాలను నిర్వహించింది. ఆ తరువాతే ఏకంగా సీబీఐ రంగంలోకి దిగింది.