ఢిల్లీ అల్లర్లలో మృత్యు ఘంటికలు.. 11కి చేరిన మృతుల సంఖ్య.. డిప్యూటీ సీఎం కీలక విజ్ఞప్తి..
దేశ రాజధాని ఢిల్లీలో మునుపెన్నడూ లేని రీతిలో హింస చెలరేగుతోంది. సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాలు తగలబడుతూనే ఉన్నాయి. రాళ్ల దాడిలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఆందోళనకారులు పలు ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తులను తగలబెట్టారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులపై భాష్ప వాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈశాన్య ఢిల్లీ పరిధిలోని కర్నాల్ నగర్, జాఫ్రాబాద్, మౌజ్పూర్, చాంద్ బాగ్,కర్వాల్, బాబర్పూర్లో కర్ఫ్యూ విధించారు.

యుద్దభూమిని తలపిస్తోన్న వీధులు..
ఈశాన్య ఢిల్లీకి సంబంధించి బయటకొస్తున్న ఫోటోలను చూస్తుంటే రణరంగాన్ని తలపించేలా కనిపిస్తున్నాయి. వీధులన్నీ యుద్దభూమిలా దర్శనమిస్తున్నాయి. తగలబడ్డ ఇళ్లు,కమ్ముకున్న పొగ,రోడ్డుపై పరుచుకుపోయిన రాళ్లు ఎటుచూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా 150 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో రతన్ లాల్ అనే హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు.

ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీం
ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజహత్ హబీదుల్లా వేసిన పిటిషన్లను సుప్రీం విచారణకు స్వీకరించింది. కాగా,ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 11 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం మౌజ్పూర్,చాంద్ బాగ్లో అదనపు భద్రతా బలగాలను మోహరించినట్టు ఢిల్లీ పోలీస్ పీఆర్వో మన్దీప్ సింగ్ తెలిపారు. ఆర్ఏఎఫ్,సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలను దింపినట్టు చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సరిపడా ఫోర్స్ లేదని కేంద్రమంత్రికి ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖకు చెప్పినట్టుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
శాంతి యాత్ర చేపట్టాలన్న కేజ్రీవాల్
ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల కారణంగా జాఫ్రాబాద్,మౌజ్పూర్,బాబర్పూర్,గోకుల్పురి,జోహ్రి ఎంక్లేవ్,శివ్ విహార్ మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఢిల్లీ పరిస్థితిపై తీవ్ర ఆందోళన చెందుతోన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే,అధికారులు,జిల్లా మెజిస్ట్రేట్ అధికారులతో భేటీ అయి.. శాంతి యాత్ర చేయాలని సూచించారు. పోలీస్ బలగాలను మరింతగా మోహరించాలని అటు కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం,ఆప్ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ఘాట్లో కేజ్రీవాల్ శాంతి ప్రార్థనలు కూడా చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
Recommended Video


డిప్యూటీ సీఎం కీలక విజ్ఞప్తి..
ఢిల్లీలో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయవద్దని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాలా ప్రాంతాల్లో వదంతులు పుట్టుకొస్తున్నాయని అన్నారు. మీ కళ్లతో మీరు ప్రత్యక్షంగా చూస్తే తప్ప.. దేని గురించి వాట్సాప్ ద్వారా ఇతరులకు షేర్ చేయవద్దని కోరారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వదంతులను వ్యాప్తి చేయకుండా ఉండటమే అతిపెద్ద సహకారం అని స్పష్టం చేశారు. పరిస్థితులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో రేపు జరగాల్సి ఉన్న సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేసుకోవాల్సిందిగా సిసోడియా కోరారు.












Click it and Unblock the Notifications