కదిలే క్యాబ్లో మహిళ అనుమానాస్పద మృతి
న్యూఢిల్లీ: పంజాబ్లోని జలంధర్కు చెందిన 55 ఏళ్ల మహిళ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో కదులుతున్న క్యాబ్లో అనుమానాస్పదంగా మరణించింది. పోలీసుల కథనం ప్రకారం కేంద్ర రిజర్వ్ పోలీస్ విభాగంలో పనిచేసి రిటైరైన కమలేష్ అనే ఆమె భర్త ఐదు సంవత్సరాల క్రితం మరణించారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన పెన్షన్ వగైరా బకాయిల కోసం రాజధాని ఢిల్లీకి వచ్చిన ఆమె అనుమానాస్పద మరణం అనేక సందేహాలను రేకెత్తించింది. పంజాబ్లోని జలంధర్కు చెందిన కమలేష్ అనే మహిళ, భర్త మరణాంతరం ఓం ప్రకాష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
కమలేష్ తన భర్త పెన్షన్ తీసుకునేందుకు, దాంతో పాటు వైద్య పరీక్షల నిమిత్తం జలంధర్ నుంచి ఓంప్రకాష్తో కలసి బుధవారం తెల్లవారుజామున పాత ఢిల్లీ రైల్వే స్టేషన్కు వచ్చారు. అక్కడి నుంచి నరేలాలోని తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ను మాట్లాడుకున్నారు.
అయితే మార్గం మధ్యలో ఆమె ఆరోగ్యం విషమించి క్యాబ్లోనే ప్రాణాలను విడిచింది. దీంతో క్యాబ్ డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆమె సహజంగానే మరణించినట్టుగా భావిస్తున్నామని పోలీసు డిప్యూటీ కమిషనర్ (ఢిల్లీ ఔటర్) విక్రంజిత్ సింగ్ తెలిపారు.

అయితే మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించామన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం వెల్లడవుతుందన్నారు. ఇది ఇలా ఉంటే, తన క్యాబ్లో కమలేష్, ఓం ప్రకాష్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని క్యాబ్ డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.
అకస్మాత్తుగా అంబులెన్స్ కావాలని, పంజాబ్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఓం ప్రకాష్ పట్టుబట్టడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని విచారణలో క్యాబ్ డ్రైవర్ వెల్లడించాడు. దీంతో కమలేష్ సహజీవనం చేసిన ఓం ప్రకాష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ విచారణలో గత రెండేళ్లుగా కమలేష్ అనారోగ్యంతో బాధపడుతోందని తెలిపాడు. అయితే డబ్బులు చెల్లించే విషయంలో క్యాబ్ డ్రైవర్తో వాదన జరిగిందని, అందుకే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఓం ప్రకాశ్
తెలిపాడు. అయితే కమలేష్ అనుమానాస్పద మృతి వెనుక ఏదైనా కుట్ర దాగుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications