ఎయిరిండియా ప్లేన్ క్రాష్: కోజికోడ్ విమానాశ్రయంలో భారీ విమానాల రాకపై ఆంక్షలు
న్యూఢిల్లీ: ఇటీవల కేరళలోని కోచికోడ్ విమానాశ్రయంలో జరిగిన భారీ ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఎవియేషణ్(డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కోజికోడ్ విమానాశ్రయంలో భారీ విమానాలను అనుమతించడం జరగదని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతేగాక, భారీ వర్షాలు కురిసిన సమయంలో విమానాశ్రయాల పరిస్థితిని పరిశీలిస్తామని చెప్పారు.

ప్రమాదం జరిగిన నాలుగు రోజులకే ఆంక్షలు..
కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం క్రాష్ అయిన నాలుగు రోజులకు డీజీసీఏ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 190 మందికిపైగా ప్రయాణికులతో వచ్చిన ఎయిరిండియా విమానం రన్ వేపై భారీగా వర్షపు నీరు చేరడంతో క్రాష్ అయ్యింది. లోయలో పడటంతో రెండు ముక్కలైంది. 18 మంది మరణించగా, 100 మందికిపైగా గాయాలపాలయ్యారు. కోజికోడ్ విమానాశ్రయంలో ఈ భారీ విమానాల నిషేధం అనేది ఎప్పటి వరకు ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమని చెప్పారు. ఈ వర్షాకాలం పోయే వరకు నిషేధం ఉండే అవకాశం ఉందని తెలిపారు.

భారీ విమానాలపై నిషేధం.. చిన్నవాటికే అనుమతి..
బీ747, ఏ 350 లాంటి భారీ విమానాలను ఈ విమానాశ్రయంలో అనుమతించమని తెలిపారు. బీ737, ఏ320 లాంటి చిన్న విమానాలను అనుమతిస్తున్నామని ఆయన తెలిపారు. భారీ విమానాలు ల్యాండ్ కావడానికి పొడవైన రన్ వే అవసరమని చెప్పారు. కోజికోడ్ ఎయిర్పోర్టు టేబుల్ టాప్ రన్ వే 10 సుమారు 2700 మీటర్ల పొడవు ఉంది. ఈ విమానాశ్రయంలో 2019 నుంచి భారీ విమానాలను అనుమతిస్తున్నారు. తాజాగా, నిషేధం విధించారు.

వర్ష ప్రభావిత విమానాశ్రయాలపై ప్రత్యేక ఆడిట్
ప్రతి ఏడాది భారీ వర్షాలతో ప్రభావితం అవుతున్న ముంబై, చెన్నై లాంటి విమానాశ్రయాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తామని డీజీసీఏ అధికారి తెలిపారు.
కోజికోడ్ తోపాటు దేశంలోని వందకుపైగా విమానాశ్రయాలను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) నిర్వహిస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మేజర్ ఎయిర్ పోర్టులను ప్రైవేటు కంపెనీలు నిర్వహిస్తున్నాయి.












Click it and Unblock the Notifications