లాక్ డౌన్ వేళ.. ఐదు లగ్జరీ కార్లలో టూర్.. అడ్డంగా బుక్కైన బిగ్ షాట్..
దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కుల,మత,ప్రాంతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తున్నారు. అయితే కొద్దిమంది మాత్రం లాక్ డౌన్కు తాము అతీతులం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆశ్చర్యంగా అధికారులు కూడా వీరికి ఎమర్జెన్సీ పాసులు ఇచ్చి సహకరిస్తుండటం గమనార్హం. మహారాష్ట్రలో లాక్ డౌన్ వేళ.. డీహెచ్ఎఫ్ఎల్ యజమాని తన కుటుంబ సభ్యులతో కలిసి లగ్జరీ కార్లలో మహాబలేశ్వర్కు హాలీ డే టూర్ కోసం వెళ్లడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
మొత్తం ఐదు కార్లలో 23 మంది కుటుంబ సభ్యులు,స్నేహితులతో కలిసి దెవాన్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(DHFL) యజమానులు కపిల్ వాధవన్,ధీరజ్ వాధవన్ ఖండాలా నుంచి మహాబలేశ్వర్ వెళ్లారు. రెండు రేంజ్ రోవర్స్,మూడు టయోటా ఫార్చునర్ కార్లలో వీరు అక్కడికి వెళ్లినట్టు సమాచారం. నిజానికి డీహెచ్ఎఫ్ఎల్ కుంభకోణంలో వాధవాన్ సోదరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి గతవారం వీరికి ఈడీ సమన్లు కూడా జారీ చేసింది. అయితే కరోనా వైరస్ సాకుతో వీరు విచారణ నుంచి తప్పించుకున్నారు.
ఓవైపు కుంభకోణం ఆరోపణలు.. మరోవైపు లాక్ డౌన్ వేళ నిబంధనలు అతిక్రమిస్తూ ప్రయాణాలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి తోడు ఫ్యామిలీ ఎమర్జెన్సీపై వెళ్తున్నామంటూ వారు పాసులు కూడా పొందడం గమనార్హం. మహారాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమితాబ్ గుప్తా ఈ పాసులు జారీ చేయడంతో.. ఆయన కూడా వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ప్రభుత్వం ఆయన్ను లీవ్పై పంపించింది.
Recommended Video
కపిల్,ధీరజ్ వాధవాన్లపై గతంలోనే సీబీఐ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. డీహెచ్ఎల్ఎఫ్లోకి రూ.14వేల కోట్ల నిధుల మళ్లింపుల్లో అవకతవకలపై వీరిపై ఆరోపణలున్నాయి. ఇదే కేసుకు సంబంధించి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. మార్చి 9వ తేదీన సీబీఐ టీమ్ వారి నివాసానికి వెళ్లినప్పటికీ.. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. తాజాగా వారి ఆచూకీ తెలియడంతో సీబీఐ వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు వారు ప్రయాణించిన లగ్జరీ కార్లను సీజ్ చేసి సీజర్ మెమో జారీ చేయాల్సిందిగా ఈడీ పోలీసులను ఆదేశించింది. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు మహాబలేశ్వర్లోని వాధవన్ బ్రదర్స్ ఫాంహౌజ్లో వీరిని అదుపులోకి తీసుకుని క్వారెంటైన్లో ఉంచినట్టు సమాచారం.