పెళ్లికి పిలువలేదు: గాలికి షాక్, కరుణాకర్ రెడ్డి, శ్రీరాములు మధ్య విభేదాలు
బళ్లారిలో చక్రం తిప్పే మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డికి షాక్. గాలికి సొంత ఇంట్లోనే ఇప్పుడు వ్యతిరేక పవనాలు ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది.
బళ్లారి: బళ్లారిలో చక్రం తిప్పే మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డికి షాక్. గాలికి సొంత ఇంట్లోనే ఇప్పుడు వ్యతిరేక పవనాలు ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. గాలి సోదరుడు కరుణాకర్ రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీరాములు మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.
గాలి కుటుంబంలోని ముగ్గురు సోదరులతో పాటు, కుటుంబ సభ్యుడిగా మారిపోయిన లోకసభ సభ్యుడు బి శ్రీరాములు కలిసి నిన్నటి వరకు జిల్లా రాజకీయాల్లో ఎదురులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు.
తాజాగా గాలి సోదరుడు అయిన గాలి కరుణాకర్ రెడ్డి - స్నేహితుడు శ్రీరాములు మధ్య భూవివాదం నెలకొంది. మాటల యుద్ధం ప్రారంభమైంది. వ్యవహారం కోర్టు మెట్లెక్కడంతో నేతలు, కార్యకర్తల మధ్య గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో సోమవారం కరుణాకర్ రెడ్డి బళ్లారిలో విలేకరులతో మాట్లాడారు. శ్రీరాములు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
తాను, తన సోదరులు బాగానే ఉన్నామని, జనార్దన్ కుమార్తె బ్రహ్మణి వివాహానికి తనను ఆహ్వానించలేదని, తాను కూడా వెళ్లలేదని, తన భాగానికి వచ్చిన ఇళ్ల స్థలాలను శ్రీరాములు విక్రయించారని, న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కానని చెప్పారు.
ప్రతీకారంగా ఎస్సీ, ఎస్టీ వేధింపుల (అట్రాసిటీ) కేసు నాపై దాఖలు చేయించారని వ్యాఖ్యానించారు. తాను బీజేపీలో సైనికుడిని అన్నారు. శ్రీరాములు అక్రమాల పైన పోరాడుతానని చెప్పారు.