కోర్టుకు: కేసీఆర్, బాబులపై డిగ్గీ, బీజేపీకోసం మజ్లిస్ అని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల పైన ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ ఆదివారం మండిపడ్డారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు కూడా తాము సిద్ధమని చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేసీఆర్ వలసలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
గతంలో ఏ ముఖ్యమంత్రి వలసలను ప్రోత్సహించలేదన్నారు. వలసలను ప్రోత్సహించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు. పార్టీ ఫిరాయింపుల పైన కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఫిరాయింపుల పైన తమ పార్టీ సభ్యులు సభాపతి, చైర్మన్లకు ఫిర్యాదు చేశారన్నారు. గడువులోగా పరిశీలించాలన్నారు.
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి పేరు మార్పుకు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. ఒకే విమానాశ్రయానికి రెండు పేర్లు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ విషయమై తాము అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

మజ్లిస్ పైన ఆగ్రహం
మజ్లిస్ పార్టీ పైన కూడా దిగ్విజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపిని గెలిపించేందుకు మజ్లిస్ పార్టీ మహారాష్ట్రలో బలపరీక్ష సమయంలో హాజరయిందని ఆరోపించారు. బీజేపీని గెలిపించేందుకు మజ్లిస్ పోటీ చేయాలనుకుంటోందన్నారు.
హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు పైన సమీక్ష సమావేశం, సమన్వయ కమిటీ సమావేశాలు ఆయన నిర్వహించారు. సోనియా జన్మదినం 9వ తేదీ నాడు భారీగా సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు.
గందరగోళం
సభ్యత్వ నమోదు సమీక్షలో కొంత గందరగోళం చెలరేగింది. దిగ్విజయ్ జిల్లా వారిగా వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హాజరు కాకపోవడంపై విహెచ్ మండిపడ్డారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కాకపోవడం కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు ఇస్తుందన్నారు.
జిల్లాల వారీగా సీనియర్లకు సభ్యత్వ నమోదు బాధ్యతను అప్పగించాలన్నారు. ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ తనకు ఆహ్వానం అందలేదని వెనక్కి వచ్చేశారు. మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రెబెల్గా తన కూతురును నిలబెట్టి, పార్టీ అభ్యర్థిని ఓడించిన పాల్వాయికి రశీదు పుస్తకం ఎలా ఇస్తారని ప్రశ్నించారు












Click it and Unblock the Notifications