సిద్దరామయ్య గ్యాంగ్ కు సినిమా: మంత్రి పదవులకు చెక్, ఎమ్మెల్యేల్లో అసమ్మతి, బీజేపీ ప్లాన్ !
బెంగళూరు: జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ పూర్తి అయిన తరువాత కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి పెరిగిపోయింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సన్నిహితంగా ఉన్న నాయకులను మంత్రి పదవులకు దూరం పెట్టారని బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నాయి. సతీష్ జారకిహోళికి మంత్రి పదవి ఇవ్వనందుకు బెళగావిలో కాంగ్రెస్ పార్టీ కార్యలయం ముందు ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు.
రాహుల్ గాంధీ
కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వర్గంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు గ్రామీణ జిల్లా హోసకోటే శాసన సభ్యుడు ఎంటీబీ నాగరాజ్, ఎంబి. పాటిల్, సతీష్ జారకిహోళి, హెచ్ఎం. పాటిల్ తదితరులు ఢిల్లీ చేరుకుని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చెయ్యడానికి సిద్దం అయ్యారు.
చాన్స్ ఉంది
మంత్రి వర్గం విస్తరణలో మాకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చెయ్యడానికి పలువురు సీనియర్ నాయకులు సిద్దం అయ్యారు. ఈ విషయంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ మాట్లాడుతూ మంత్రి వర్గంలో ఇంకా కొంత మందికి అవకాశం కల్పించడానికి చాన్స్ ఉందని, మరోసారి జరిగే మంత్రి వర్గం విస్తరణలో వారికి చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
నిర్ణయం తీసుకుంటాం
కర్ణాటక మాజీ మంత్రి ఎంబి. పాటిల్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తనకు భాదకలిగించాయని, తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో తెలియడం లేదని, తన నియోజక వర్గానికి వెళ్లిన తరువాత కార్యకర్తలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే
కేపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు, కర్ణాటక కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే లక్ష్మి హెబ్బాళ్కర్ సైతం కాంగ్రెస్ పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎమ్మెల్సీ అయిన నటి జయమాలకు ఎలా మంత్రి పదవి ఇస్తారని లక్ష్మి హెబ్బాళ్కర్ తన అనుచరుల దగ్గర అసహనం వ్యక్తం చేశారని సమాచారం.