రాజకీయాలా?: గవర్నర్ విద్యాసాగర్ రావుపై స్టాలిన్ తీవ్ర విమర్శ
చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గవర్నర్ విద్యాసాగర్ రావు రాజకీయాలు చేస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. తమిళనాడులో తలెత్తిన రాజకీయ సంక్షోభం వెనుక కేంద్రం హస్తముందని మరోసారి ఆరోపించారు.
బుధవారం విపక్ష పార్టీలతోపాటు స్టాలిన్ గవర్నర్ను కలిశారు. సీఎం పళనిస్వామిపై విశ్వాసపరీక్షకు అనుమతించాలని గవర్నర్ కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భాగస్వామ్య పార్టీలతోపాటు గురువారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలుస్తామని స్టాలిన్ తెలిపారు.
రాష్ట్రపతిని కలిసిన తర్వాత కూడా తమిళనాడు ప్రభుత్వంపై చర్య తీసుకోకుంటే.. కోర్టును ఆశ్రయిస్తామని స్టాలిన్ తెలిపారు. ఇది ఇలా ఉండగా, తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీలో రెబల్ రాజకీయాలు చెయ్యాలనుకుంటున్న టీటీవీ దినకరన్కు గవర్నర్ విద్యాసాగర్ ఝలక్ ఇచ్చారు.
దినకరన్ వర్గంలోని 20మందికి పైగా ఎమ్మెల్యేలు ఇంకా అన్నాడీఎంకే పార్టీలోనే ఉన్నారని గవర్నర్ స్పష్టం చేయడం గమనార్హం. 20మంది ఎమ్మెల్యేల డిమాండ్ మేరకు బలపరీక్ష నిర్వహించలేమని ఆయన తేల్చి చెప్పారు.
దీంతో దినకరన్ వర్గం కూడా గవర్నర్పై గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం తమపై తప్పుడు ప్రచారం చేసేందుకు కేంద్రమంత్రులను కలుస్తున్నారని శశికళ మేనల్లుడైన టీటీవీ దినకరన్ ఆరోపిస్తున్నారు.