ఐర్లాండ్ లో టీమిండియా అట్టర్ ఫ్లాప్ షో: గాయాలపై ఉప్పు రాసిన సూర్యకుమార్ యాదవ్
ప్రస్తుతం భారత టీ20 జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఉంది. ఐర్లాండ్ తో రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఇప్పటికే ముగిసింది కూడా. ఇక ఇంగ్లాండ్ లో పర్యటించాల్సి ఉంది. ఐర్లాండ్ లో అట్టర్ ఫ్లాప్ అయింది టీమిండియా. రెండు మ్యాచ్ లనూ కోల్పోయింది. 0-2 తేడాతో వైట్ వాష్ కు గురైంది. టీమిండియాతో పోల్చుకుంటే ఐర్లాండ్ జట్టు పసికూనే. అయినప్పటికీ టీ20 ఫార్మట్ లో దిగ్గజం భారత జట్టును మట్టికరిపించింది. భారత్ పై మొదటిసారిగా సిరీస్ ను గెలుచుకుంది.
ఈ పరిణామాల మధ్య టీ20 ఫార్మట్ మాజీ కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు. 2024లో సరిగ్గా ఇదే రోజును భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా అభివర్ణించాడు. రెండేళ్ల కిందట జూన్ 29వ తేదీ నాడే బార్బడోస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ జగజ్జేతగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆ చారిత్రాత్మక విజయం సాధించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అతను ఈ పోస్ట్ పెట్టాడు.

ఈ విజయ ప్రయాణంలో కంటితుడుపుగా కాకుండా నిరంతరం మద్దతుగా నిలిచిన కోట్లాది మంది అభిమానులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పేర్కొన్నాడు. ఆనాటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నాడు. క్రీడల్లో కొన్ని క్షణాలు తమ జీవితంలో ఎప్పటికీ నిలిచిపోతాయని, ఆ మరపురాని ఘటన వెనుక తాము పడిన ఎన్నో త్యాగాలు, ఎదుర్కొన్న వైఫల్యాలు, కఠిన సాధనతో పాటు స్టేడియంలో అభిమానుల కేరింతలు ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందాన్ని సహచర ఆటగాళ్లతో పంచుకోవడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారతీయులతో కలిసి ఆ విజయాన్ని అనుభవించడం ఇప్పటికీ తనకెంతగానో గర్వంగా అనిపిస్తోందని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అండగా నిలిచిన సన్నహితులు, శ్రేయోభిలాషులు, అభిమానుల గురించి సూర్యకుమార్ భావోద్వేగంగా మాట్లాడాడు. ఫైనల్కు ముందు, మ్యాచ్ జరుగుతున్నప్పుడు, ఆ తర్వాత కూడా అభిమానుల నుంచి లభించిన ప్రేమ అవధులు లేనిదని చెప్పాడు. 2024 జూన్ 29వ తేదీని తాము ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటామని పేర్కొన్నాడు. నాటి ట్రోఫీ విజయోత్సవ ఫొటోలను షేర్ చేశాడు.
There are moments in sport that stay with you forever.
— Surya Kumar Yadav (@surya_14kumar) June 29, 2026
Every sacrifice, every setback, every practice session, every cheer from the stands- it all led to that unforgettable night.
Proud to have shared it with an incredible group of people and to have experienced it with… pic.twitter.com/MEsj4h2N9m
టీ20 ప్రపంచకప్లో అజేయంగా నిలిచిన టీమిండియా, ఫైనల్ లో దక్షిణాఫ్రికా జట్టుపై 7 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, చివరి ఓవర్లలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి మ్యాచ్ను మలుపు తిప్పారు. డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ ను బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో మ్యాచ్ భారత్ వశమైంది. అదే ఫొటోను ఇప్పుడతను షేర్ చేశాడు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు సూర్యకుమార్ యాదవ్ ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ విఫలమైన నేపథ్యంలో సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. జట్టులోకి కూడా తీసుకోలేదు. శ్రేయాస్ అయ్యర్ ను కేప్టెన్ గా నియమించారు. ఇప్పుడు అదే జట్టు ఐర్లాండ్ తో సిరీస్ ఓడింది. ఈ పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ పెట్టిన ఈ ట్వీట్ చర్చనీయాంశమౌతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications