పంచారామ క్షేత్రాలకు మహర్దశ.. కేంద్రానికి ఎంపీ సానా సతీష్ బిగ్ ప్రతిపాదన!
తెలుగు నేలపై అత్యంత పవిత్రంగా భావించే పంచారామ క్షేత్రాలను జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఈ ఐదు దివ్య క్షేత్రాలను కలిపి 'జాతీయ టెంపుల్ టూరిజం - పంచారామ శివ టెంపుల్ సర్క్యూట్'గా అభివృద్ధి చేయాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను నేరుగా కలసి ప్రత్యేక వినతిపత్రంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను అందజేశారు.
స్వదేశ్ దర్శన్ 2.0లో చోటు కల్పించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'స్వదేశ్ దర్శన్ 2.0' పథకం కింద ఈ పంచారామ క్షేత్రాలను చేర్చాలని ఎంపీ ప్రతిపాదించారు. అమరావతి (అమరారం), ద్రాక్షారామం, భీమవరం (సోమారం), సామర్లకోట (కుమారారామం), పాలకొల్లు (క్షీరారామం) పుణ్యక్షేత్రాలను ఒకే ఆధ్యాత్మిక సర్క్యూట్గా మలిచితే దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని వివరించారు. ఇప్పటికే ఉన్న బౌద్ధ, కృష్ణ సర్క్యూట్ల తరహాలోనే ఈ 'పంచారామ శివ సర్క్యూట్'కు జాతీయ గుర్తింపు తేవాలని, ఇందుకోసం తక్షణమే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు.

నాలుగు లేన్ల రహదారులు.. మెరుగైన మౌలిక వసతులు
ఈ ఆధ్యాత్మిక యాత్ర భక్తులకు సులభతరం కావాలంటే రవాణా సౌకర్యాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఎంపీ సానా సతీష్ స్పష్టం చేశారు. అందుకోసం అమరావతి-ద్రాక్షారామం, సామర్లకోట-ద్రాక్షారామం, పాలకొల్లు-భీమవరం మార్గాలను నాలుగు లేన్ల రహదారులుగా విస్తరించాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, ఎన్హెచ్ఏఐతో సమన్వయం చేసుకోవాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీటితో పాటు ప్రాచీన ద్రాక్షారామ క్షేత్రంలోని చారిత్రక శాసనాల పరిరక్షణకు ఇంటర్ప్రిటేషన్ సెంటర్, డిజిటల్ డాక్యుమెంటేషన్, పార్కింగ్ మరియు డిజిటల్ గైడెన్స్ వంటి ఆధునిక వసతులు కల్పించాలని ప్రతిపాదించారు.
స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొండంత తోడ్పాటు
పంచారామాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా మారిస్తే గోదావరి జిల్లాలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యాటక రంగం పుంజుకోవడమే కాకుండా, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ తెలిపారు. ఎంపీ అందించిన ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎంతో సానుకూలంగా స్పందించారని, సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. గోదావరి ప్రాంతాన్ని దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెట్టడమే తన ప్రధాన లక్ష్యమని ఎంపీ సానా సతీష్ బాబు పేర్కొన్నారు.




Click it and Unblock the Notifications