సచివాలయంలో విజయ్ రికార్డు: ఎక్స్ప్రెస్ వేగంతో పాలన
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల కాలంలోనే విజయ్ తనదైన ముద్రను వేస్తున్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి రాజకీయ దిగ్గజాలను ఓడించి, టీవీకే (TVK) పార్టీ ద్వారా అధికారాన్ని దక్కించుకున్న ఆయన, పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సచివాలయంలో సరికొత్త రాజకీయ సంస్కృతిని పరిచయం చేస్తున్నారు. అవినీతి లేని, ప్రజా రంజక పాలనను అందిస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి, ఫైళ్ల క్లియరెన్స్లో ఆయన చూపిస్తున్న వేగం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
క్రమశిక్షణే ఆయుధంగా.. 10 టు 6 పరిపాలన
సినిమా రంగంలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన విజయ్, అదే క్రమశిక్షణను రాజకీయాధికారంలోనూ తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకల్లా సచివాలయానికి చేరుకోవడం, సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా ప్రభుత్వ విధుల్లోనే గడపడం ఆయన దినచర్యగా మారింది. మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్లకుండా, సచివాలయంలోనే భుజిస్తూ, విశ్రాంతి సమయాన్ని కూడా ఫైళ్ల పరిశీలనకే కేటాయిస్తున్నారు. ఎలాంటి అడంబరాలు లేకుండా, ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారించిన ముఖ్యమంత్రి శైలి, సచివాలయ అధికారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

ఫైళ్లు ఎక్స్ప్రెస్ వేగంతో.. అధికారుల ఆశ్చర్యం
గత ప్రభుత్వాల హయాంలో విధానపరమైన ఫైళ్లు ఒక విభాగం నుంచి మరొక విభాగానికి చేరడానికి ఎంతో సమయం పట్టేది. కానీ, విజయ్ ప్రభుత్వంలో ఉదయం సమర్పించిన ఫైళ్లు సాయంత్రానికల్లా తుది ఆమోదం పొందుతుండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో పనిచేసిన కరుణానిధి, జయలలిత, స్టాలిన్ వంటి హేమాహేమీల కాలంలో ఫైళ్లు పెండింగ్లో ఉండటానికి పార్టీ ఫండ్స్, కమీషన్లు, సమన్వయ లోపాలు ప్రధాన కారణాలుగా ఉండేవని అధికారులు గుర్తుచేస్తున్నారు. అయితే, విజయ్ ప్రభుత్వం ఈ జాప్యానికి తావులేకుండా, అధికారులకు పూర్తి అధికారాలు కల్పిస్తూ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇవ్వడంతో పాలన ఎక్స్ప్రెస్ వేగంతో సాగుతోంది.
అభివృద్ధి పథంలో తమిళనాడు
ముఖ్యమంత్రి బాటలోనే మంత్రులు కూడా ఫైళ్లను వేగంగా క్లియర్ చేస్తూ, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు త్వరగా చేరువ చేస్తున్నారు. పరిపాలనపైనే పూర్తి దృష్టి సారిస్తూ, నిర్ణీత సమయంలోనే ఫైళ్ల క్లియరెన్స్ పూర్తి చేస్తుండటం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైంది. ఇదే నిబద్ధతతో కూడిన వేగవంతమైన పాలన భవిష్యత్తులోనూ కొనసాగితే, తమిళనాడు అభివృద్ధి పథంలో మరిన్ని మైలురాళ్లను అధిగమిస్తుందని సచివాలయ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి.














Click it and Unblock the Notifications