ఆ చేదు మర్చిపోను, జయపై కక్ష ఉండదు: కరుణానిధి
చెన్నై: ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తనకు చేసిన అవమానాన్ని మరిచిపోనని, ఆ బాధ, చేదు అనుభవం ఎప్పటికీ గుర్తుంటుందని, అలాగని తాను అధికారంలోకి వచ్చినా ఆమె పైన ప్రతీకారం తీర్చుకోనని డీఎంకే అధినేత కరుణానిధి శనివారం నాడు చెప్పారు.
తమిళనాడు ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రచారం ముగుస్తున్న సమయంలో కరుణానిధి మాట్లాడారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి తాను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినా జయలలితపై ఏమాత్రం ప్రతీకార చర్యలు ఉండవన్నారు.
గడచిన ఐదేళ్ల అన్నాడీఎంకే పాలనలో ఒక్కరైనా సంతృప్తిగా ఉన్నారా? రాష్ట్రంలో అసలైన ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం డీఎంకేకు ఓటేయాలని పిలుపునిచ్చారు. మేం అధికారంలోకి వస్తే జయపై ప్రతీకార చర్యలకు పాల్పడమని స్పష్టం చేశారు.
గతంలో జయలలిత నన్ను చిత్రహింసల పాల్జేసి హతమార్చాలని అర్ధరాత్రి పోలీసులను తన ఇంటికి పంపించారని, అరెస్ట్ సమయంలో తన మేనల్లుడు మురసోలి మారన్, ఇతర నాయకులు కాపాడేందుకు ప్రయత్నించి దెబ్బలు తిని గాయాలపాలయ్యారని, ఆ చేదు అనుభవాన్ని నేను ఇంకా మరిచిపోలేదన్నారు.
జయ, కరుణలకు ఈసీ షాక్
అన్నాడీఎంకే, డీఎంకేకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. రెండు పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత హామీల హోరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలను ఎన్నికల సంఘం ప్రశ్నించింది. లెక్కలేనన్ని ఉచిత పథకాలకు డబ్బులెక్కడి నుంచి తెస్తారో చెప్పాలంటూ ఆ రెండు పార్టీల చీఫ్లు జయలలిత, కరుణానిధిలకు ఈసీ నోటీసులు జారీ చేసింది.
నేటి సాయంత్రంలోగా ఈ నోటీసులకు సమాధానం చెప్పాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని సదరు నోటీసుల్లో ఈసీ ఘాటుగానే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు డైలమాలో పడ్డాయి.