మోడీ ఆరా, ప్రణబ్ ట్వీట్: 'జయ మా అమ్మ, ఆమె మమ్మల్ని వదిలి వెళ్లదు'
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు రావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలు స్పందించారు.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు రావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలు స్పందించారు.
ప్రధాని మోడీ ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావుకు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. రాత్రి 10.30 గంటల సమయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. జయకు గుండెపోటు వచ్చిందని తెలిసి ఆవేదనకు లోనయ్యానని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు.
జయలలితకు గుండెపోటు రావటంతో ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో వారు ఆమె ఆరోగ్యపరిస్థితిని తెలుసుకునేందుకు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు ఆసుపత్రి గేటు వద్దకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభిమానులు బారికేడ్లనుతోసుకొని ముందుకెళ్లారు.
జయలలితకు చికిత్స అందించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు బయలుదేరారు. వారి సోమవారం అపోలోకు చేరుకుంటారు.
ప్రత్యేక ప్రార్థనలు
జయలలిత కోలుకోవాలని అపోలో ఆసుపత్రి వద్ద, రాష్ట్రవ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. 'అమ్మ బాగున్నారు. మాకోసం ఆమె మళ్లీ ఆరోగ్యంగా తిరిగి వస్తారు. ఆమె మా తల్లి. మా నాయకురాలు. ఆమెకు ఎలాంటి హానీ జరగదు.' అని ఓ జయలలిత మద్దతుదారు ఆసుపత్రి వద్ద రోదించారు.
'ఆమె కోసం మేం పూజలు చేస్తున్నాం. మేమంతా ఆమెకు అండగా ఉన్నాం. ఆమె మమ్మల్ని వదిలి వెళ్లదు. ఆమె ఆరోగ్యంగా తిరిగి వస్తుంది. ఆమె బాగున్నారు. ఉదయానికల్లా ఆమె బాగున్నారని వార్త వస్తుంది' అని మరో మద్దతుదారు ఆందోళనగా చెప్పారు.