టర్కీ డ్రోన్లు వచ్చింది దాడి కోసం కాదా ? పాక్ అసలు కుట్ర వేరే ఉందా ?
నిన్న రాత్రి 9 గంటల సమయంలో పాకిస్తాన్ నుంచి భారీ ఎత్తున డ్రోన్లు భారత్ లోకి ప్రవేశించాయి. భారత్ లోని జమ్మూ, జైసల్మేర్ తో పాటు దాదాపు 36 ప్రాంతాల్లో 300 నుంచి 400 డ్రోన్లు దూసుకొచ్చాయి. వీటిని భారత రక్షణ వ్యవస్థ యాక్టివ్ అయి వీటిని ఎక్కడిక్కడ కూల్చేసింది. అయితే ఇంత భారీ స్ధాయిలో పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు టర్కీకి చెందినవని మన అధికారులు తేల్చారు. అంతే కాదు ఇంత భారీ స్దాయిలో వీటి ప్రయోగం వెనుక ఉన్న భారీ కుట్రను కూడా నిర్దారించారు.
ఇవాళ విదేశాంగశాఖ నిర్వహించిన ప్రెస్ మీట్ లో కల్నల్ సోఫియా ఖురేషీ పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు టర్కీకి చెందినవని తేలినట్లు ప్రకటించారు. అంతే కాదు 36 ప్రాంతాలపై ఎగిరిన దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను మన ఆయుధ రక్షణ వ్యవస్థ కుప్పకూల్చిందని వెల్లడించారు. దీంతో ఇంత భారీ ఎత్తున ఈ డ్రోన్ల ప్రయోగం వెనుక దాడుల కంటే మించిన మరో కారణం ఉన్నట్లు ఆమె తెలిపారు. అదే భారత రక్షణ వ్యవస్థల అధ్యయనం.

భారత్-పాక్ మధ్య జరుగుతున్న పోరులో ఇప్పుడు ఆయుధాల కంటే వాటిని కుప్పకూల్చే వ్యవస్థలే కీలకంగా మారాయి. ఇప్పటికే పాకిస్తాన్ లోని వాణిజ్య నగరం లాహోర్ పై దాడి చేసి అలాంటి వ్యవస్థల్ని భారత్ కుప్పకూల్చింది. ఇప్పుడు భారత్ ఎలాంటి రక్షణ వ్యవస్థల్ని వాడుతుందో మాత్రం పాకిస్తాన్ కు తెలియదు. అలాంటి వ్యవస్థలను తెలుసుకునేందుకే ఇలా నిన్న రాత్రి భారీ ఎత్తున పాకిస్తాన్ టర్కీ తయారీ డ్రోన్లను ప్రయోగించినట్లు కల్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు.
ఇంత పెద్ద ఎత్తున వైమానిక చొరబాట్ల ఉద్దేశ్యం వాయు రక్షణ వ్యవస్థలను పరీక్షించడం మరియు నిఘా సమాచారాన్ని సేకరించడమే అని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. డ్రోన్ల శిథిలాల ఫోరెన్సిక్ దర్యాప్తు జరుగుతోందన్నారు. ప్రాథమిక నివేదికలు అవి టర్కిష్ అసిస్గార్డ్ సోంగర్ డ్రోన్లని సూచిస్తున్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications