పాన్షాపు పెట్టుకొన్నా రూ. 5లక్షలు, ప్రభుత్వ జాబ్ కోసం నేతల వెంటపడొద్దు: త్రిపుర సీఎం
అగర్తల: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేబ్ చేసిన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత రాజకీయ నేతల వెంటపడకూడదని త్రిపుర సీఎం బిప్లబ్ దేబ్ వ్యాఖ్యానించారు. చదువుకున్న యువత పాన్షాపులు పెట్టుకొని స్వయం ఉపాధికి మొగ్గు చూపాలని సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాజకీయ నేతలపై ఒత్తిడి పెంచకూడదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా ప్రధానమంత్రి ముద్ర యోజన కింద రుణాలు పొంది వివిధ వ్యాపారాలు చేపట్టేందుకు మొగ్గు చూపాలని సలహ ఇచ్చారు.
త్రిపుర యువకులు ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాజకీయ పార్టీల చుట్టూ తిరిగి తమ విలువైన సమయం వృధా చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. నేతల చుట్టూ తిరిగే బదులు సొంతంగా పాన్ షాపు పెట్టుకుని ఉంటే ఆయా యువకుల వద్ద ఈపాటికి రూ 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేదన్నారు.రూ 75 వేల బ్యాంకు రుణంతో నిరుద్యోగ యువత నెలకు సులువుగా రూ 25,000 ఆర్జించవచ్చని చెప్పుకొచ్చారు.
చదువుకున్న వారు వ్యవసాయం, పౌల్ర్టీ పనులు వంటివి చేయరాదనే చులకన భావం ప్రజల్లో నెలకొందని అన్నారు. స్టార్టప్ ప్రాజెక్టులకు ప్రధాని ప్రవేశపెట్టిన ముద్ర రుణంతో యువకులు గౌరవంగా స్వయం ఉపాధితో జీవించే అవకాశం ఉందని చెప్పారు.