కొత్త వేరియంట్లపై ఎలా పనిచేస్తాయో తెలియదు.. వ్యాక్సిన్లపై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్
కరోనా వైరస్ పలు రకాలుగా రూపాంతరం చెందుతోంది. జనాలను భయాందోళనకు గురిచేస్తోంది. మానవాళికి వైరస్ మరింత ముప్పుగా పరిణమిస్తున్న వేళ ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ పలు విధాలుగా రూపు మార్చుకుంటున్నందున, ఇప్పటి వ్యాక్సిన్లు దానిపై ఎంతమేర పనిచేస్తున్నాయన్న దానిపై స్పష్టత లేదని అన్నారు.
వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నా.. అప్రమత్తంగా ఉండక తప్పదని స్పష్టం చేశారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని, విధిగా భౌతికదూరం పాటించాలని సూచించారు. మాస్కులు, భౌతికదూరం ద్వారా ప్రాథమికంగా కరోనా నుంచి కాపాడుకోవచ్చని గులేరియా అభిప్రాయపడ్డారు. అమెరికా వంటి దేశాల్లో రెండు డోసుల టీకా తీసుకున్న వారు మాస్కు ధరించనవసరం లేదని అక్కడి ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది.
వ్యాక్సిన్ పొందినవారు మాస్కులు ధరించాల్సిన పనిలేదన్న అంశాన్ని ప్రస్తుతానికి మార్గదర్శకాల్లో చేర్చబోవడం లేదని స్పష్టం చేసింది. వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో మాస్కులు ధరించనవసరం లేదనడం సరైన నిర్ణయం కాదని కేంద్రం పేర్కొంది. టీకా తీసుకున్నా.. మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టంచేసింది.
ఫిజికల్ డిస్టన్స్ కూడా ముఖ్యం అని పేర్కొన్నది. కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యాల తీరు మాత్ర వింతగా ఉంది. అంత ఎందుకు వైరస్ ఆవిర్భవించిన వుహాన్లో కూడా ప్రతీ ఒక్కరు మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. భారతదేశంలో మాత్రం కరోనా ప్రభావం అధికంగానే ఉంది. వైరస్ సోకడంతోపాటు.. మరణాలు కూడా ఎక్కువగానే ఉంటుంది.