మాస్కులు ధరించకుంటే కొడతారా: ఆ రాష్ట్ర హైకోర్టు సీరియస్..పోలీసులపై చర్యలకు ఆదేశం
భోపాల్: మాస్కులు ధరించకుండా రోడ్డుపైకి వచ్చేవారికి పోలీసులు తమ లాఠీలకు పని చెప్పరాదని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికరమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు వారు భౌతిక దూరం పాటించకపోయినా, లాక్డౌన్ నిబంధనలు పాటించకపోయినా పోలీసులు వారిని శిక్షించడం కానీ, కొట్టడం కానీ చేయరాదని మధ్యప్రదేశ్ హైకోర్టు సూచించింది. చీఫ్ జస్టిస్ మొహ్మద్ రఫీఖ్, జస్టిస్ అతుల్ శ్రీధరన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలను కాన్పూర్ ఎస్పీకి జారీ చేసింది. పోలీసులు ప్రజలను కొడుతున్న ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పిన ధర్మాసనం... ప్రజలపై చేయిచేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఓషీన్ శర్మ అనే వ్యక్తి ప్రజాప్రయోజనం వ్యాజ్యంను హైకోర్టులో దాఖలు చేయగా పిటిషన్ను విచారణ చేసింది ధర్మాసనం. అంతేకాదు పరదేశీపురా పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆటో రిక్షావాలాపై ఈ పోలీసులు ఇద్దరూ ప్రతాపం చూపడం, కనీసం జాలి దయ అనేది కూడా చూపకుండా విపరీతంగా కొట్టడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక పోలీసుల వ్యవహార శైలిని పర్యవేక్షించేందుకు ఒక స్వతంత్ర కమిటీ లేదా గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు.

ఓ ఆటోవాలా మాస్కును సరిగ్గా ధరించనందుకు పోలీసులు అతన్ని చితకబాదిన వీడియో వైరల్గా మారింది. దీనికి సంబంధించిన కథనం ఏప్రిల్ 8వ తేదీన ప్రముఖ జాతీయ పత్రికలో వచ్చింది. వీడియో వైరల్ కావడంతో ఇండోర్లోని పరదేశీపురా పోలీస్ స్టేషన్లో పనిచేసే ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్ అయ్యారు. మాస్కు ఎందుకు సరిగ్గా ధరించలేదని ఆటోవాలాను పోలీసులు అడుగగా తన తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడని తనని చూసేందుకు వెళుతున్నట్లు చెప్పాడు. ఇదంతా పట్టించుకోని పోలీసులు అతన్ని పోలీసు స్టేషన్కు రావాల్సిందిగా బలవంతపెట్టారు. దీంతో అక్కడ కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఆటోరిక్షావాలా కొడుకు తన తండ్రిని కొట్టొద్దని పోలీసులను వేడుకున్నాడు. అయినప్పటికీ వారు కనికరించలేదని కోర్టుకు పిటిషనర్ తరపున న్యాయవాది విన్నవించారు. ఇదే కాకుండా మరో ముగ్గురు జర్నలిస్టులపై కూడా మధ్యప్రదేశ్ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
Recommended Video
వాదనలు విన్న కోర్టు పోలీసులకు చురకలంటించింది. కోవిడ్ నిబంధనలు, కోవిడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు కౌన్సిలింగ్ ఇవ్వాలి తప్పా అలా చేయి చేసుకోకూడదని ఆదేశించింది. అంతేకాదు మాస్కులు ధరించకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా, లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినా వారికి ఎలాంటి శిక్ష విధించరాదని చెప్పింది.












Click it and Unblock the Notifications