కోవిడ్ను లైట్ తీసుకోవద్దు... హృదయం ముక్కలయ్యే ఆవేదన... గర్భంతో ఉన్న భార్యను పోగొట్టుకున్న భర్త...
దేశంలో కరోనా విషాదం గురించి ఎంత చెప్పినా తక్కువే... గుండెను పిండేసే ఘటనలు నిత్యం కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి... ఏ క్షణాన ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో తెలియని కాలాన దేశమంతా కరోనా గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది... అయినవాళ్లను పోగొట్టుకున్నవాళ్లు కరోనాను లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.. తాజాగా కరోనాతో మృతి చెందిన ఓ గర్భిణి స్త్రీ భర్త ట్విట్టర్లో హార్ట్ టచింగ్ పోస్టు పెట్టాడు.
రవీష్ చావ్లా ఆవేదన...
'నా మూడేళ్ల కుమారుడు ఇప్పుడు పూర్తిగా మౌనం దాల్చాడు... తన తల్లి ఆస్పత్రిలో చేరినప్పుడు రోజూ భగవంతుడిని ప్రార్థించాడు... దేవుడా మా అమ్మను కోలుకునేలా చెయ్యి అంటూ... కానీ ఇప్పుడు తల్లి ప్రస్తావన రాగానే ఏడుస్తున్నాడు... తన తల్లి ఎప్పుడు తిరిగి వస్తుందో అడగడం కూడా మానేశాడు... ఆ మూడేళ్ల పసివాడికి కూడా ఇక తన తల్లి లేదన్న విషయం అర్థమైనట్లే కనిపిస్తోంది... ఇప్పటికీ మా ఫ్యామిలీ ఫోటో ఎప్పుడైనా చూస్తే అమ్మను గుర్తుచేస్తాడు,ఆమె గురించి అడుగుతాడు....' అంటూ రవీష్ చావ్లా అనే వ్యక్తి ట్విట్టర్లో తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...
తల్లి గురించి తన కొడుకు అడిగిన ప్రతీసారి ఏం చెప్పాలో తెలియక హృదయం ముక్కలవుతోందని రవీష్ చావ్లా వాపోయారు. మూడేళ్ల పిల్లాడికి ఇక వాడి తల్లి తిరిగి రాదని చెప్పినా అర్థం చేసుకోలేడని అన్నారు. రవీష్ చావ్లా భార్య డింపుల్ చావ్లా డెంటల్ సర్జన్. ఆమె ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లినా రెండు లేదా మూడు మాస్కులు ధరించేది. కొన్నిసార్లు పీపీఈ కిట్ ధరించే బయటకు వెళ్లేది. ప్రస్తుతం గర్భంతో ఉన్న కారణంగా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకునేది.

కరోనా బారినపడ్డాక ఫరీదాబాద్కు...
తమది ఉమ్మడి కుటుంబం అని... కొద్దిరోజుల క్రితం తన భార్య డింపుల్,తన కుమారుడు సహా పలువురు కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారని రవీష్ చావ్లా తెలిపారు. దీంతో ఫరీదాబాద్లోని డింపుల్ ఇంటికి షిఫ్ట్ అయ్యామని చెప్పారు. అక్కడికి వెళ్లిన కొద్దిరోజులకు తన కుమారుడికి పూర్తిగా నయమైందని... కానీ డింపుల్కు మాత్రం జ్వరం,దగ్గు తగ్గలేదని చెప్పారు. ఆమె గర్భంతో ఉన్న కారణంగా ఎక్కువ మోతాదులో మెడిసిన్ తీసుకోవడానికి ఇష్టపడలేదని.. అలా చేస్తే కడుపులో బిడ్డకు హాని జరుగుతుందని భయపడిందని తెలిపారు.

ఆ నిజం తెలిస్తే తట్టుకోలేదని...
ఇదే క్రమంలో ఒకరోజు ఆమె ఆక్సిజన్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయని... దీంతో ఫరీదాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించామని రవీష్ చావ్లా తెలిపారు. అక్కడ ఆమెకు రెమ్డివిసిర్ ఇంజెక్షన్ ఇచ్చారని... కానీ ఏప్రిల్ 25న ఆమెకు పొత్తి కడుపులో నొప్పి తీవ్రమై చివరకు కడుపులో బిడ్డ చనిపోయిందని తెలిపారు. దీంతో కడుపులో బిడ్డను వైద్యులు తొలగించారని... అయితే ఆ నిజం తెలిస్తే తన భార్య తట్టుకోలేదన్న కారణంతో ఆమెతో అబద్దం చెప్పినట్లు తెలిపారు. పుట్టిన బిడ్డ ప్రస్తుతం ఎన్ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అబద్దం చెప్పానని పేర్కొన్నారు.
Recommended Video

కోవిడ్ను లైట్ తీసుకోవద్దని హెచ్చరిక...
ఆ తర్వాతి రోజు తన భార్య ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయని.. కానీ ఆ మరుసటిరోజే అకస్మాత్తుగా ఆమె చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి బెడ్ పైనే కరోనా జాగ్రత్తల గురించి చెబుతూ తన భార్య చేసిన వీడియోను రవీష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కోవిడ్ను లైట్ తీసుకోవద్దని అందులో ఆమె అందరినీ హెచ్చరించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూనే ఆ వీడియో చేసింది. తాను కరోనా సమస్యతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నప్పుడు కూడా తన భార్య అందరికీ జాగ్రత్తలు చెప్పిందని... ఆమె చాలా ధైర్యవంతురాలని రవీష్ చావ్లా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications