మీరిద్దరూ గొడవపడితే ఎదుటోళ్లు బలపడుతారు: ములాయంతో లాలూ
తండ్రి-కొడుకుల ఘర్షణ ఎదుటివారికి అవకాశం ఇచ్చేదిగా తయారవుతుందని లాలూ వారితో పేర్కొనట్టు సమాచారం.
పాట్నా: తండ్రి-కొడుకులు రాజీకి రావడంతో ఎస్పీలో పుట్టిన ముసలం కొన్ని గంటల్లోనే సర్దుమణిగిన సంగతి తెలిసిందే. అంతర్గతంగా పార్టీ వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి మాత్రం చీలికలు ఉండబోవన్న సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఎస్పీ రాజకీయాలపై స్పందించారు.
శనివారం నాడు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్తో, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్తో లాలూ ప్రసాద్ యాదవ్ విడివిడిగా ఫోన్లో మాట్లాడారు. యూపీ రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితిపై వారితో లాలూ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇద్దరు కలిసి పనిచేయాలని లాలూ వారికి సూచించారు.
ఆర్జేడీ కార్యాలయ సిబ్బంది ద్వారా ఈ విషయం వెల్లడైంది. తండ్రి-కొడుకుల ఘర్షణ ఎదుటివారికి అవకాశం ఇచ్చేదిగా తయారవుతుందని. తద్వారా వారు బలపడవచ్చునని లాలూ వారితో పేర్కొనట్టు సమాచారం. పార్టీని అభివృద్ధి చేసిందీ, అఖిలేశ్ ఓ సీఎం స్థాయికి ఎదిగేలా చేసింది మీరే కాబట్టి.. ఎస్పీ రాజకీయ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా మీదేనని లాలూ ములాయంతో చెప్పినట్టు తెలుస్తోంది.
అఖిలేష్ పై సస్పెన్షన్ వేటును ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడం తనకు సంతోషాన్నిచ్చిందని లాలూ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో యూపీలో ఎస్పీనే అధికారంలోకి వస్తుందని లాలూ ధీమా వ్యక్తం చేశారు.