రూ.1.3 కోట్ల కోసం మహిళ కిడ్నాప్: 9 మంది అరెస్టు

నిందితుల నుంచి పోలీసులు 90 లక్షల రూపాయల నగదును, 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు రోజు తనను ఓ ముఠా అపహరించిందని అనేకల్ గట్టహళ్లికి చెందిన 68 ఏళ్ల హెచ్ఆర్ అనసూయ హెబ్బగొడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అత్యంత నమ్మకంగా ఉంటూ వచ్చిన డ్రైవర్ కిడ్నాప్ వెనక ఉన్నట్లు అనసూయ ఆరోపించింది. తన కుమారుడు రామి రెడ్డి కోటి రూపాయలు చెల్లించిన తర్వాత తనను విడుదల చేశారని అనసూయ చెప్పింది. తాను కోరమంగళలోని తన కుమారుడి ఇంటికి వెళ్తుండగా ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఇద్దరు అపరిచితులు టాటా సుమోలో వచ్చి తనను కిడ్నాప్ చేశారని ఆమె చెప్పింది.
కత్తి చూపి తనను బెదిరించి కిడ్నాప్ చేశారని, తన డ్రైవర్ రాజును మాత్రం వదిలేశారని ఆమె చెప్పింది. రాజు రామిరెడ్డి ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. ఈలోగా కిడ్నాపర్లు రామిరెడ్డికి ఫోన్ చేసి పది కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు.
అనసూయను మాండ్యా, మెల్కోటే, మైసూరులు తిప్పి చివరికి బెంగళళూర్ - మైసూరు జాతీయ రహదారిపై వదిలేసిపోయారు. కిడ్నాపర్లు ఆమె కుమారుడి నుంచి కోటి రూపాయలు, బంగారు నగలు తీసుకున్నారు. నిందితులను పట్టుకోవడానికి 30 మందితో ఓ పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.
రాజు ఫోన్ రికార్డులను పోలీసులు పరిశీలించారు. దీంతో అతనిపై అనుమానం పెరిగి విచారించారు. తనకు గణేష్ అనే మిత్రుడి ద్వారా సయద్ ఇమ్రాన్ తెలుసుని చెప్పారు. రాజు ఇచ్చిన సమాచారం మేరకే అనసూయను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. రాజు, ఇమ్రాన్, గణేష్, మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications