విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం.. తమిళనాడు అభివృద్ధికి గొడ్డలిపెట్టు: స్టాలిన్ మండిపాటు
పరందూర్ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టును ఉపసంహరించుకుంటూ తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధిని దశాబ్దాల కాలం వెనక్కి నెట్టేసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టడం తమిళనాడు ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని ఆయన విమర్శించారు.
రాష్ట్ర భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి అతి ముఖ్యమైన నిర్ణయాన్ని శాసనసభలో ఎలాంటి చర్చకు తావు లేకుండా, నిబంధన 110 కింద ముఖ్యమంత్రి ఏకపక్షంగా ప్రకటించడంపై స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచడానికి గానీ, ఈ అంశంపై చర్చించడానికి గానీ కనీస అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని స్టాలిన్ పేర్కొన్నారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా అభివర్ణించారు.

ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల నుంచి ఆటోమొబైల్స్ తయారీ వరకు వివిధ రంగాలలో తమిళనాడు దేశంలోనే ముందంజలో ఉందని స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి తరుణంలో చెన్నైకి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మరో నూతన విమానాశ్రయం ఎంతైనా అవసరమని స్పష్టం చేశారు. అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించిన తర్వాతే తాము గతంలో పరందూర్ స్థలాన్ని ఎంపిక చేశామని, భూసేకరణ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయిందని వెల్లడించారు.
రెండోసారి తాము అధికారంలోకి రాగానే ఈ పరందూర్ అంతర్జాతీయ విమానాశ్రయం పనులను వేగవంతం చేసేలా ప్రణాళికలు కూడా రూపొందించుకున్నామని స్టాలిన్ తెలిపారు. తమ ద్రావిడ మోడల్ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి తమిళనాడును మొదటి ప్రాధాన్యతగా ఎంచుకునేవారని స్టాలిన్ పేర్కొన్నారు. ప్రస్తుత టీవీకే ప్రభుత్వ నిర్ణయం కారణంగా రాష్ట్రం పెట్టుబడుల్లో వెనుకంజ వేసే ప్రమాదం ఉందని అన్నారు.
ఈ అనాలోచిత నిర్ణయం పొరుగు రాష్ట్రాలకు వరంగా మారబోతోందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామిక వృద్ధి లేకపోతే 1.5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చేర్చాలనే లక్ష్యం నెరవేరడం అసాధ్యమని ఆయన తేల్చి చెప్పారు. ఎలాంటి ముందుచూపు,
సరైన వ్యూహం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడులోని నిరుద్యోగ యువత ఉపాధి కలలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ కొత్త స్థలాన్ని వెతకడం, మొదటి నుంచి అనుమతులు పొందడం వల్ల ప్రాజెక్టు నిర్మాణ కాలం మరింత ఆలస్యమౌతుందని, ఇది రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తుందని స్టాలిన్ హెచ్చరించారు. అటు సభలో కూడా డీఎంకే సభ్యులు ఈ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించారు.













Click it and Unblock the Notifications