రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం: సీజేఐ ఎన్వీ రమణ ఘనత: వైఎస్ జగన్ తరఫున వారు హాజరు
న్యూఢిల్లీ: దేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కొద్దిసేపటి కిందటే ఈ కార్యక్రమం పూర్తయింది. ఆమె.. దేశానికి 15వ రాష్ట్రపతి. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. హిందీలో..దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి పేద, గిరిజన మహిళ సాధించిన విజయంగా అభివర్ణించారు.
ఈ కార్యక్రమానికి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియా గాంధీ, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెప్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పార్లమెంటరీ పార్టీ అధినేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి, లోక్సభ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహారాష్ట్ర, ఒడిశా, హర్యానా, బిహార్ ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, నవీన్ పట్నాయక్, మనోహర్ లాల్ ఖట్టర్, నితీష్ కుమార్ ఇందులో పాల్గొన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కొందరు మంత్రులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తన లక్ష్యాలను వివరించారు. కోట్లాది మంది ప్రజల, స్వాతంత్య్ర సమరయోధుల మనోభావాలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని, ఈ దిశగా తాను ప్రయత్నం చేస్తానని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత జన్మించి, అత్యున్నత పదవిని అందుకున్న మొట్టమొదటి రాష్ట్రపతిగా గుర్తింపు పొందానని చెప్పారు.

రాష్ట్రపతి పదవికి అర్హురాలిగా తనను ఎన్నుకొన్న వారందరికీ ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవిని సాధించడాన్ని తన లక్ష్యానికి చేరుకున్నట్లుగా భావించట్లేదని వ్యాఖ్యానించారు. ఈ ఘనతకు తనకు దక్కినట్టు కాదని, దేశంలోని ప్రతి నిరుపేదకు, ప్రతి గిరిజన మహిళ సాధించిన అత్యద్భుత విజయంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రతి పేద వ్యక్తి కలలు కనడమే కాదు.. దాన్ని సాకారం చేసుకోగలరనే విషయాన్ని తన నామినేషన్ రుజువు చేసిందని ద్రౌపది ముర్ము అన్నారు.












Click it and Unblock the Notifications