విశాఖపట్నం కొత్త వందే భారత్ టైమ్ టేబుల్, హాల్ట్ స్టేషన్ల వివరాలు ఇవే..
Vande Bharat express: దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. కొత్త కొత్త మార్గాల్లో వాటిని నడిపిస్తోంది.
ఇప్పటివరకు 54..
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 54 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది.

ఫాస్టెస్ట్ ట్రైన్..
సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు. ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వీటి సంఖ్యను మరింత పెంచుతోంది. ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది.
ఈ మార్గాల్లో..
నేడు మరో 10 వందే భారత్ రైళ్లు ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానున్నాయి. టాటా నగర్- పాట్నా, వారణాశి- దేవ్గఢ్, టాటానగర్- బరంపురం, రాంచీ- గొడ్డ, ఆగ్రా- వారణాశి, హౌరా- గయ, హౌరా- భాగల్పూర్, పుణే- నాగ్పూర్తో పాటు నాగ్పూర్- సికింద్రాబాద్, దుర్గ్- విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.
దుర్గ్ టు వైజాగ్..
ఛత్తీస్గఢ్లోని దుర్గ్- విశాఖపట్నం రూట్ కూడా ఇప్పటికే ఖరారయింది. ఈ మార్గంలో ఇప్పటివరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులో లేదు. దుర్గ్- విశాఖపట్నం మధ్య దూరం 566 కిలోమీటర్లు. ప్రస్తుతం రాకపోకలు సాగించడానికి ప్రస్తుతం 15 నుంచి 16 గంటల సమయం పడుతోంది. వందే భారత్ వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. వందే భారత్ వల్ల 7 గంటల్లోగా చేరుకోవచ్చు.
టైమింగ్స్, హాల్ట్ స్టేషన్స్
ప్రతి రోజూ తెల్లవారు జామున 5:45 నిమిషాలకు దుర్గ్ నుంచి బయలుదేరే నంబర్ 20829 వందే భారత్ ఎక్స్ప్రెస్ రాయ్పూర్- 6:13 నిమిషాలకు చేరుకుంటుంది. మహాసముంద్- 6:53, ఖరియార్ రోడ్- ఉదయం 7:28, కాంటాబాంజీ- 8:13, టిట్లాగఢ్- 8:43, కేసింగ- 8:55, రాయగడ- 11:00, విజయనగరం- మధ్యాహ్నం 12:35 మీదుగా 1:45 నిమిషాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్కు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో
తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:45 నిమిషాలకు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. విజయనగరం- 3:33, రాయగడ- సాయంత్రం 5:30, కేసింగ- 6:50, టిట్లాగఢ్- 7:05, కాంటాబాంజీ- 7:35, ఖరియార్ రోడ్- రాత్రి 8:20, మహాసముంద్- 9:00, రాయ్పూర్- 9:19 మీదుగా రాత్రి 10:50 నిమిషాలకు దుర్గ్కు చేరుకుంటుంది.
జార్ఖండ్లో లాంచ్..
త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది జార్ఖండ్. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మొత్తం ఆరు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. మిగిలిన నాలుగింటినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చజెండా ఊపుతారు.












Click it and Unblock the Notifications