హర్యానాలో హంగ్ అసెంబ్లీ-కింగ్ మేకర్ గా జేజేపీ-ఏఎస్పీ కూటమి ?
వచ్చే నెల 1న జరగబోతున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీతో ఓవైపు కాంగ్రెస్, మరోవైపు జేజేపీ-ఏఎస్పీ పార్టీల కూటమి పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో ముక్కోణపు పోరులో హంగ్ అసెంబ్లీ తప్పదని జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా తాజాగా వెల్లడించారు. హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరగబోతోందో కూడా ఆయన చెప్పేశారు. దీంతో ఇప్పుడు చౌతాలా వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
ఎన్నికలకు ముందు బీజేపీకి మద్దతిచ్చి ప్రభుత్వంలో కొనసాగిన జనతా జన్నాయక్ పార్టీ (జేజేపీ) తాజాగా మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా ఏఎస్పీతో జట్టుకట్టి పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిన్న పార్టీల కూటమి బీజేపీ, కాంగ్రెస్ లో ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొట్టబోతోందన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో వచ్చేది హంగ్ అసెంబ్లీయే నంటూ చౌతాలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రెండు పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

గతంలో 2019 ఎన్నికల్లో కేవలం 10 సీట్లే సాధించిన జేజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. అప్పట్లో బీజేపీకి మద్దతిచ్చు సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగింది. తాజాగా కూటమి సర్కార్ నుంచి బయటికి వచ్చిన జేజేపీ ఈసారి బీజేపీ టార్గెట్ గా ముందడుగు వేస్తోంది. ఇందుకోసం ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్)తో జట్టు కట్టింది కూడా. అయితే ఈ రెండు పార్టీలు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యే అవకాశాలున్నాయని ఇప్పటివరకూ వెలువడిన సర్వేలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications