ఉత్తరాంధ్రలో భూప్రకంపనలు: కంపించిన ఉత్తరభారతం
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉత్తర భారతదేశంలో వారం వ్యవధిలోనే రెండు సార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం అక్కడి ప్రజలను ఆందోళనలకు గురిచేస్తోంది. తాజాగా, బుధవారం సాయంత్రం కూడా ఉత్తర భారతదేశంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో జనం బయటికి పరుగులు తీశారు.
కాగా, మయన్మార్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై ఈ భూకంప తీవ్ర 7.1గా నమోదైంది. ఈ ప్రభావంతో ఈశాన్య, ఉత్తర భారతదేశంపై చూపింది.
గౌహతి, కోల్కతా, పాట్నా, ఢిల్లీల్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, కోల్కతా నగరాల్లో మెట్రో రైళ్లను నిలిపివేశారు. తమిళనాడులోని చెన్నై నగరంలో కూడా పలు చోట్లు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూ ప్రకంపనల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
ఉత్తరాంధ్రలో కంపించిన భూమి
ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా బుధవారం సాయంత్రం స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. ఆందోళన చెందిన ప్రజలు బయటికి పరుగులు తీశారు.