మోదీకి అగ్నిపరీక్ష - ఆ రెండు రాష్ట్రాల్లో: మోగనున్న ఎన్నికల నగారా: షెడ్యూల్కు సిద్ధం
న్యూఢిల్లీ: దేశంలో మరో రెండు అతిపెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వాళ వెలువడనుంది. దీనికి సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ షెడ్యూల్ను విడుదల చేయనుంది. దీనికోసం విలేకరుల సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం-ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లల్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో కొనసాగుతోంది.

మోదీ-షా ఫోకస్..
పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వరాష్ట్రం కూడా గుజరాతే కావడం వల్ల- ఇక్కడి ఎన్నికల ఫలితాలపై దేశ ప్రజలందరి దృష్టీ నిలుస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇప్పటికే శక్తివంచన లేకుండా కృషి చేస్తోన్నారు మోదీ. 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు గుజరాత్లో పర్యటించారు. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రకటించారు. అందులో కొన్నింటిని ప్రారంభించారు. మరి కొన్నింటికి శంకుస్థాపన చేశారు.

అగ్నిపరీక్షగా..
ఇందులో భాగంగా వందేభారత్ ఎక్స్ప్రెస్ను ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రారంభించారాయన. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లల్లో ప్రధాని మోదీ, అమిత్ షా విస్తృతంగా పర్యటించారు కూడా. వారి సత్తాకు ఈ రెండు రాష్ట్రాలు అగ్నిపరీక్షగా మారాయి. సుదీర్ఘకాలంగా గుజరాత్ను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతూ వస్తోన్న గుజరాత్లో ముఖ్యమంత్రి భూపేన్ పటేల్ ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు వీస్తోన్నాయంటూ వస్తోన్న వార్తల నేపథ్యంలో మోదీ-అమిత్ షా ఈ రాష్ట్రంపై కాన్సన్ట్రేట్ చేశారు.

10 రోజుల్లో రెండుసార్లు..
ఇందులో భాగంగా- మోదీ గుజరాత్లో సుమారు 45 వేల కోట్ల రూపాయల విలువ చేసే భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. మూడో విడత వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. అహ్మదాబాద్- ముంబై సెంట్రల్ మధ్య రాకపోకలు సాగిస్తోందీ ఎక్స్ప్రెస్. కిందటి నెల చివరివారంలో మోదీ అహ్మదాబాద్లో నేషనల్ గేమ్స్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేస్-1ను ప్రారంభించారు. సరిగ్గా 10 రోజుల తరువాత అంటే ఈ నెల 9వ తేదీన ఆయన గుజరాత్లో పర్యటించారు. మూడు రోజుల పాటు అక్కడే మకాం వేశారు.

వేల కోట్ల ప్రాజెక్టులు..
తన రెండో విడత గుజరాత్ పర్యటన సందర్భంగా ఆయన 14,500 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. సబర్మతి-జగుడన్ స్టేషన్ల మధ్య గేజ్ మార్పిడి, ఓఎన్జీసికి చెందిన నందసన్ జాగ్రాఫికల్ ఆయిల్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్, సుజలాం సుఫలాం కెనాల్, ధరోహి డ్యామ్ ప్రాజెక్ట్, మొధెరా-ఛనస్మా రహదారి విస్తరణ పనులను ప్రారంభించారు.

త్రిముఖ పోటీ..
ఇదివరకెప్పుడూ లేనివిధంగా ఈ సారి గుజరాత్లో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. బీజేపీ-కాంగ్రెస్తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ గట్టిపోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు. కేజ్రీవాల్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గుజరాత్లో మకాం వేశారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications