ఆ అభ్యర్థులకు గుడ్న్యూస్: ఖర్చు పరిమితి పెంపు: ఆంక్షల మధ్యే
న్యూఢిల్లీ: దేశంలో ఒకవంక ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తీవ్ర రూపాన్ని దాల్చింది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గురువారం నాటి బులెటిన్ ప్రకారం.. 90 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణకూ అంతు లేకుండా పోయింది. దీన్ని అడ్డుకోవడానికి దాదాపు అన్ని రాష్ట్రాలు ఆంక్షలను అమలు చేస్తోన్నాయి. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లను మళ్లీ ప్రవేశపెట్టాయి.

అయిదు రాష్ట్రాల ఎన్నికలపై
మరోవంక- అయిదు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్లల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి అవసరమైన నోటిఫికేషన్- వచ్చే నెల చివరివారంలో విడుదలయ్యే అవకాశాలు లేకపోలేదు. కోవిడ్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ.. ఆ మాటకొస్తే గంటగంటకూ పెరుగుతోన్న ఈ పరిస్థితుల్లో పోలింగ్ నిర్వహణా అంశం.. కత్తి మీద సాములా మారింది. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులకు.

షెడ్యూల్ ప్రకారమే..
ఈ అయిదు రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహిస్తామంటూ ఇదివరకే స్పష్టం చేశారు. వాయిదాపై ఎలాంటి నిర్ణయాలను తీసుకోలేదు. కేంద్రం విడుదల చేసిన కోవిడ్ ప్రొటోకాల్స్కు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు చేస్తామంటూ హామీ ఇచ్చారు. దీనిపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర, కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే..ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితులను అంచనా వేశారు. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోన్నారు.

పోలింగ్ నిర్వహణపై..
ఈ పరిస్థితుల మధ్య పోలింగ్ సమయంలో ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలను తీసకోవాల్సి ఉంటుందనే విషయంపై కసరత్తు మొదలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ టాస్క్ఫోర్స్తో సమావేశం అయ్యారు. ఎన్నికల ప్రచార ర్యాలీలు, సభలపై నిషేధం విధించేలా చర్యలు తీసుకోనున్నారు. ఆంక్షల మధ్య.. పరిమితంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించుకునే వెసలుబాటును కల్పించాలని నిర్ణయించారు.

టాస్క్ఫోర్స్తో భేటీ..
ఎన్నికల ప్రచారం, పోలింగ్ బూత్, కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ, కోవిడ్ టాస్క్ ఫోర్స్ నుంచి పలు సూచనలు స్వీకరించారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ నుంచి కోవిడ్ ప్రొటోకాల్స్కు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఓ పూర్తిస్థాయి నియంత్రణ ఆదేశాలను జారీ చేసే అవకాశం ఉంది.

ఎన్నికల వ్యయ పరిమితి..
అదే సమయంలో- కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితిని పెంచారు. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. అయిదు రాష్ట్రాలతో పాటు భవిష్యత్తులో నిర్వహించబోయే అన్ని లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఇది వర్తిస్తుంది. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల వ్యయ పరిమితిని ప్రాతిపదికన తీసుకున్నారు అధికారులు. దీన్ని స్వల్పంగా సవరించారు.

పెంపు ఇలా..
లోక్సభ ఎన్నికల వ్యయం 70 లక్షల నుంచి 95 లక్షల రూపాయలు, 54 లక్షల నుంచి 75 లక్షల రూపాయల వరకు పెంచారు. అసెంబ్లీ ఎన్నికల వ్యయం 28 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు, 20 లక్షల నుంచి 28 లక్షల రూపాయల వరకు పెంచారు. దీన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఎన్నికల వ్యయ పరిమితి పెంచడంపై రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి హరీష్ కుమార్, ఉమేష్ సిన్హా, సెక్రెటరీ జనరల్ చంద్రభూషణ్ కుమార్, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్తో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా దీన్ని పెంచినట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications