జకీర్ నాయక్ రూ.18.37 కోట్ల ఆస్తులు అటాచ్, రెండోసారి నోటీసులు
వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్కు (ఐఆర్ఎఫ్) చెందిన రూ.18.37 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్కు (ఐఆర్ఎఫ్) చెందిన రూ.18.37 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.
ఐఆర్ఎఫ్ను జకీర్ నాయక్ నడుపుతున్నాడు. దీనిని యూనియన్ హోం మినిస్ట్రీ బ్యాన్ చేసింది. మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ మొత్తాన్ని ఈడీ అటాచ్ చేసింది.
కాగా, అంతకుముందు జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) జకీర్ నాయక్కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయంలో మార్చి 30వ తేదీలోగా హాజరు కావాలని ఆదేశించింది.
జకీర్ నాయక్కు ఎన్ఐఏ నోటీసు పంపడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఇచ్చిన నోటీసులో మార్చి 14న విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ పేర్కొంది. జకీర్ హాజరుకాకపోవడంతో మరోసారి ఎన్ఐఏ నోటీసులిచ్చింది.
అతనికి చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్) అధికారులు ఎన్ఐఏ రెండో నోటీసును గత శుక్రవారంనాడు అందుకున్నారు. గత ఏడాది ఢాకాలో ఉగ్రదాడులకు పాల్పడిన వ్యక్తులు జకీర్ ప్రసంగాలతోనే తాము స్ఫూర్తి పొందినట్టు వెల్లడించడంతో అతను చిక్కుల్లో పడ్డాడు.
అరెస్టును తప్పించుకునేందుకు అప్పటి నుంచి ఆయన సౌదీ ఆరేబియాలో ఉంటున్నాడు. మతం పేరుతో భిన్న గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారనే కారణంగా జకీర్తో సహా ఐఆర్ఎఫ్కు చెందిన కొందరు అధికారులపై కేసు నమోదైంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కూడా జకీర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.