వాల్మీకి కార్పోరేషన్ స్కామ్, ఐటీ హబ్, హైదరాబాద్ లో ఈడీ సోదాలు, అధికార పార్టీకి?
కర్ణాటక మహర్షి వాల్మీకి కార్పొరేషన్ అధ్యక్షుడు బసనగౌడ దద్దాల్ నివాసంపై ఈడీ అధికారులు దాడులు చేశారు. కర్ణాటకలోని రాయచూరు నగరంలోని ఆషాపూర్ రోడ్లోని బపవనగౌడ దద్దల్ నివాసంపై బుధవారం ఉదయం 7 గంటలకు ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఈడీ అధికారుల రాకతో బసవనగౌడ దద్దల్ తో పాటు ఆయన వర్గీయులు హడలిపోయారు.
ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చిన ఈడీ అధికారుల బృందం పత్రాలను పరిశీలించడం మొదలుపెట్టారని తెలిసింది. వాల్మీకి కార్పోరేషన్ అధ్యక్షుడు బసవనగౌడ దద్దల్ను మంగళవారం సిట్ అధికారులు విచారించారు. బుధవారం ఆయన్ను మళ్లీ విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏకకాలంలో ఈడీ అధికారులు ఏకంగా 18 ప్రాంతాల్లో సోదాలు మొదలుపెట్టారని కన్నడ మీడియా అంటోంది

ఇదే సమయంలో వాల్మీకి కార్పోరేషన్ ఎండీ జేజే పద్మనాభ్, అకౌంటెంట్ పరశురాం ఇళ్లపైనా దాడులు చేసిన ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కర్ణాటక మాజీ మంత్రి, బళ్లారి గ్రామీణ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగేంద్ర సన్నిహితుడు నెక్కంటి నాగరాజ్, సత్యనారాయణ వర్మతో పాటు పలువురికి చెందిన ఇళ్లు, కార్యాలయంలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
బెంగళూరు, బళ్లారిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగేంద్ర నివాసం, రాయచూరులోని కార్పొరేషన్ అధ్యక్షుడు దద్దల్ నివాసంపై ఈడీ అధికారులు దాడులు చేశారు. బెంగళూరులోని పద్మనాభనగర్ లోని మాజీ మంత్రి నాగేంద్ర నివాసం, హైదరాబాద్లోని సత్యనారాయణ వర్మ నివాసం కార్యాలయం సహా మొత్తం 18 చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి తనిఖీలు చేస్తున్నారు.

వాల్మీకి కార్పోరేషన్ లో అవకతవకలు జరిగాయని, వాటి గురించి విషయాలు బయటకు రాకూడదని బెదిరించారని ఆరోపిస్తూ ఆశాఖకు చెందిన సీనియర్ ఉద్యోగి ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇదే ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగేంద్ర ఆయన మంత్రి పదవికి రాజీనామా చెయ్యాల్సి వచ్చింది. నాగేంద్ర మంత్రి పదవికి రాజీనామా చెయ్యడంతో సీఎం సిద్దరామయ్య ఈ కేసు దర్యాప్తును సిట్ కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సిట్ అధికారులు ఈ కేసు విచారణ చేస్తున్న సమయంలోనే ఈడీ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో మాజీ మంత్రి నాగేంద్ర తదితరులు హడలిపోతున్నారని తెలిసింది












Click it and Unblock the Notifications