కరోనా ఎఫెక్ట్: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం, బద్వేలుతోపాటు దేశ వ్యాప్తంగా ఉపఎన్నికలు వాయిదా
న్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్లో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్నవేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా పలు కారణాల వళ్ల ఖాళీ అయిన అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
దేశంలో కరోనా పరిస్థితిపై సమీక్షించిన అనంతరం.. పరిస్థితులు మెరుగుపడే వరకు ఉపఎన్నికలు నిర్వహించరాదని ఎన్నికల సంఘం నిర్ణయించింది.కాగా, దాద్రా నగర్ హవేలీ, ఖండ్వా(మధ్యప్రదేశ్), మండి(హిమాచల్ ప్రదేశ్), లోక్సభ స్థానాలతోపాటు పలు రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు ఈసీ ఇప్పటికే నోటీఫై చేసింది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు కల్కా ఎలియాబాద్(హర్యానా), వల్లభ్ నగర్(రాజస్థాన్), సిండ్గి(కర్ణాటక), రాజబల: మారౌంగ్ కెంగ్(మేఘాలయా), ఫతేపూర్(హిమాచల్ప్రదేశ్)లలో ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, సంబంధిత రాష్ట్రాల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత పరిస్థితిపై సమీక్షించి తగిన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ పేర్కొంది.
కడప జిల్లాలోని బద్వేలులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మార్చి నెలాఖరున అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్రమంలో ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరగాల్సి ఉంది. కాగా, ఇటీవలే తిరుపతి లోక్సభ స్థానానికి ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గెలుపొందారు.
Recommended Video
ఇటీవల ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంపై కోర్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మద్రాసు హైకోర్టు ఏకంగా హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని తీవ్రంగా స్పందించింది.