ఇదీ ఓ ఇంజినీరింగ్ అద్భుతం: దీని ముందు ఈఫిల్ టవర్ దిగదుడుపే
జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను కలపడంతోపాటు ఏడేళ్ల క్రితం మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన రైల్వే కనెక్టివిటీ పథకం ‘భారీ వంతెన' మరో రెండేళ్లలో పూర్తి కానున్నది.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను కలపడంతోపాటు ఏడేళ్ల క్రితం మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన రైల్వే కనెక్టివిటీ పథకం 'భారీ వంతెన' మరో రెండేళ్లలో పూర్తి కానున్నది. అంతే కాదు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఉదంపూర్ - శ్రీనగర్ - బారాముల్లా మార్గం వేస్తున్నారు.
ఈ మార్గమధ్యంలో చీనాబ్ నదిపై రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. 2019లో పూర్తయ్యే ఈ బ్రిడ్జి జమ్మూలోని బక్కల్ - శ్రీనగర్లోని కత్రా - కౌరిలను కలుపుతున్నది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే అంతర్జాతీయంగా ఎనిమిది వింతల్లో ఒకటిగా ఉన్న 'ఈఫిల్ టవర్'ను మించిన ఎత్తు కలదిగా ఉంటుంది. ఈ వంతెన నది అడుగు భాగం నుంచి ఎత్తు 359 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది ఈఫిల్ టవర్ ఎత్తుకంటే 35 మీటర్ల ఎత్తు ఎక్కువ.
అంటే ఇది పూర్తయ్యాక ఈ ఇంజనీరింగ్ అద్భుతం ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో నిర్మించిన రైల్వే బ్రిడ్జి అవుతుంది. చీనాబ్ నది మట్టానికి 359 మీటర్ల ఎత్తులో రెండు కొండలను కలుపుతూ ఈ వంతెనను నిర్మిస్తున్నారు. 275 మీటర్ల ఎత్తులో ఉన్న షుయ్బాయ్ రైల్వే బ్రిడ్జి (చైనా)ని రెండో స్థానానికి నెట్టివేస్తుందీ మన చీనాబ్ బ్రిడ్జి. పారిస్లోని ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు. చినాబ్ నదిపై నిర్మిస్తున్న వంతెన పొడవు 1.3 కిలోమీటర్లు. తనిఖీ నిమిత్తం రోప్ వే కూడా ఉంటుంది. రైల్వే లైన్తో పాటు పాదచారులు నడిచి వెళ్లేందుకు దారి, సైకిళ్లు వెళ్లడానికి మరోదారి ఉంటుంది.
కశ్మీర్ వాతావరణానికి అనుగుణంగా వంతెన డిజైన్
కశ్మీర్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలను, గంటకు 260 కిలోమీటర్ల గాలివేగాన్ని తట్టుకునేలా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేందుకువీులగా దీన్ని రూపొందించారు. జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల బెడద ఎక్కువ. దాని ప్రభావం నుంచి వంతెన నిర్మాణం చేపట్టేందుకు 63 ఎంఎం మందం గల పేలుళ్లను తట్టుకునే సామర్థ్యం గల 24,000 టన్నుల ఉక్కు వినియోగిస్తున్నారు. తీవ్రవాద దాడులు జరిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఈ జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ వంతెన నిర్మాణానికి పెడుతున్న ఖర్చు రూ.1,100 కోట్లు. గంటకు 90 కిలోమీటర్ల కంటే వేగంగా గాలులు వీస్తున్నట్లయితే సెన్సర్ల ద్వారా బ్రిడ్జికి ఇరువైపులా రెడ్సిగ్నల్ పడిపోతుంది. ఆ సమయంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా వంతెనపై నుంచి రైళ్ల రాకపోకలను అనుమతించరు. గాలివేగం తగ్గాక మళ్లీ ప్రయాణం మొదలవుతుంది. దీని నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వస్తే కశ్మీర్ లోయకే సరికొత్త అందాలు తీసుకొస్తుంది. పర్యాటక శోభ కలిగిస్తుంది. జమ్ముకశ్మీర్ వాసులు ప్రత్యేకించి హిమాలయ పర్వత శ్రేణుల్లో తేలిగ్గా ప్రయాణం చేసేందుకు వీలు కలుగుతుంది.
2003లో రూపుదిద్దుకున్న ప్రతిపాదనలు
2003లో ఈ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. జమ్ము, బారాముల్లా ప్రాంతాలను విస్తరించడంతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల మధ్య అనుబంధం పెంపుదలకు చోటు కల్పిస్తుందీ వంతెన. కత్రాలో కొలువుదీరి ఉన్న శ్రీవైష్ణో దేవీ దేవాలయాన్ని వివిధ దేశాల పౌరులు కూడా సందర్శించడానికి వెసులుబాటు లభిస్తుంది. ఈ ప్రాజెక్టు మార్గంలో పలు వంతెనలు, టన్నెళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి.
నిర్మాణంలో సవాళ్లు ఎదురు కావడంతో 2008లో కొంత కాలం పనులు నిలిపేశారు. సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు భవితవ్యంపై పూర్తిస్థాయి సమీక్షించారు. 2009లో రైల్వే బోర్డు దీనికి ఆమోదం తెలిపితే వంతెన నిర్మాణం డిజైన్ను 2012 జూలైలో రైల్వేశాఖ ఆమోదించింది. చినాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పొడవైన వంతెనల నిర్మాణంలో ఎదురైన సవాళ్లు, సమస్యలను అధ్యయనం చేశాకే చేపట్టారు.
పలు అధ్యయనాలు, పరీక్షల తర్వాతే పనులు ప్రారంభం
ఈ వంతెన నిర్మాణం తర్వాత తలెత్తే పలు సమస్యలపై నార్వే కేంద్రంగా పని చేస్తున్న ఫోర్స్ టెక్నాలజీ ల్యాబోరేటరీ పలు పరీక్షలు నిర్వహించింది. గాలి వేగం, దానిని ఎదుర్కొనే సామర్త్యం అన్ని పరీక్షించారు. ఆ తర్వాతే 260 కిలోమీటర్ల వేగాన్నైనా తట్టుకునే సమార్థ్యంతో దీన్ని తీర్చి దిద్దారు. ఈ వంతెనకు భద్రత కల్పించేందుకు అనునిత్యం ఏరియల్ సర్వే సాగుతూనే ఉంటుంది. ఆన్ లైన్ మానిటరింగ్, వార్నింగ్ సిస్టమ్ కూడా ఈ వంతెనపై ఏర్పాటు చేస్తారు. ఏళ్ల తరబడి వంతెన కొనసాగేలా నిర్మించారు. అంతే కాదు జనానికి దూరంగా ఉన్న ఈ వంతెన నిర్మాణం చాలా కష్ట సాధ్యంగా ఉన్నది.
చినాబ్ నదీ జలాలే ఒక అడ్డంకిగా పరిణమించాయి. వంతెన వద్దకు చేరుకునేందుకు చుట్టూ ఐదు కిలోమీటర్ల పొడవునా రోడ్డు నిర్మించారు. ఈ వంతెన నిర్మాణాన్ని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 40 టన్నుల టీఎన్టీ సామర్థ్యం గల పేలుడు పదార్థాలు ప్రయోగించినా తొణకని విధంగా, రిక్టర్ స్కేల్ పై 8.5 తీవ్రత నమోదైనా చెక్కు చెదరకుండా ఈ వంతెన నిర్మాణం సాగుతోంది. ఇది పూర్తయితే అంతర్జాతీయ చరిత్రలోనే ఒక ఇంజినీరింగ్ అద్భుతంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.