త్వరలో దేశీయ మార్కెట్లోకి: ఇండియన్ వేరియంట్పై సమర్థంగా పనిచేసే ఎంఆర్ఎన్ఏ కరోనా వ్యాక్సిన్
న్యూఢిల్లీ: భారత కరోనా వేరియంట్పై ఎంఆర్ఎన్ఏ కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని యూరోపియన్ రెగ్యూలేటర్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. కాగా, కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా భారత్కు ఎంఆర్ఎన్ఏ కోవిడ్ వ్యాక్సిన్లను తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు దేశీయ ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ వెల్లడించింది. ఇందు కోసం ఇతర వ్యాక్సిన్ తయారీ సంస్థలతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
కరోనా చికిత్సకు అవసరమయ్యే రెమిడిసివిర్ వంటి ఇతర ఔషధాలను కూడా దేశానికి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు లుపిన్ సంస్థ తెలిపింది. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను దేశానికి తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పిన లుపిన్స్.. ప్రస్తుతం కనీసం ఆరు కంపెనీలకు చెందిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపింది. వీటిలో ఏదో ఒకదానితో కలిసి చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ సంస్థలతో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నామని, ఎప్పుడు డీల్ కుదురుతుందో చెప్పలేమని లుపిన్ ఎండీ నీలేశ్ గుప్తా తెలిపారు. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో వ్యాక్సిన్లు తయారు చేసిన వాటిలో ఫైజర్, మోడెర్నా కరోనా కట్టడిలో ముందున్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒకదానితో లుపిన్ ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నాయి.
EMA is monitoring very closely the data on the Indian variant. We are seeing promising evidence that mRNA vaccines would be able to neutralise this variant. #EMAPresser
— EU Medicines Agency (@EMA_News) May 12, 2021
అయితే, దిగుమతుల ద్వారా ఈ వ్యాక్సిన్లను తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. రెమిడిసివిర్ తోపాటు కరోనా చికిత్సలో ఉపయోగించే బాక్రిసిటినిబ్ ఔషధాన్ని దేశంలోకి తెచ్చేందుకు లుపిన్ ఇప్పటికే ఎలీ లిల్లీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే రెండు నెలల్లో బాక్రిసిటినిబ్ ను లుపిన్ దేశీయా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానుంది.