ఈవీఎంను దొంగిలించలేదు -పోల్ సిబ్బందికి సాయం చేశానన్న బీజేపీ అభ్యర్థి -నలుగురిపై ఈసీ వేటు, రీపోలింగ్
బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎంల తరలింపు ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈసీ పచ్చిగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న వేళ.. పోలింగ్ పూర్తయిన ఈవీఎంలు బీజేపీ నేతల చేతుల్లో కనిపించడం వివాదాస్పదమైంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి నలుగురు సిబ్బందిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. తాను సాయం చేయాలని ప్రయత్నించానే తప్ప తప్పుచేయలంటూ ఈవీఎంలతో పట్టుపడిన బీజేపీ అభ్యర్థి వివరణ ఇచ్చుకున్నారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ కు వెళ్లాల్సిన ఈవీఎంలు కాస్తా బీజేపీ అభ్యర్థికి చెందిన కారులో దర్శనమిచ్చాయి. కరీంగంజ్ జిల్లా రతాబరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు ఫోటోలు, వీడియోలు వైరల్ కావడం, ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఈసీ ఎట్టకేలకు ఆ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికను రద్దు చేసింది. రతాబరి సెగ్మెట్ లోని 149వ పోలింగ్ బూత్ లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
తన భార్య కారులో ఈవీఎంలను తరలించడంపై రతాబరి బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ వివరణ ఇచ్చారు. తానేమీ ఈవీఎంలను దొంగలించలేదని, ఎన్నికల అధికారులు సహాయం కోరితే చేశానని తెలిపాడు. ''నా డ్రైవర్ కారులో ఉన్నాడు. పోలింగ్ అధికారులు అతనిని సహాయం కోసం అభ్యర్థించారు. ఆయన సహాయం చేశాడు. నా కారుపై బీజేపీ అభ్యర్థి అన్న పాస్ ఉంది. ఈ విషయం ఎన్నికల అధికారులకు తెలుసో, తెలియదో నాకు తెలియదు. మేం సహాయం చేశాం అంతే తప్ప ఈవీఎంలను దొంగిలించలేదు'' అని కృష్ణేందు పాల్ వివరణ ఇచ్చారు.
పరిషత్ పోరు: ఏప్రిల్ 8న పోలింగ్ -నోటిఫికేషన్ జారీ -ఆగిన చోట నుంచే ఎన్నికలు -ఎస్ఈసీ నీలం సంచలనం
బీజేపీ అభ్యర్థికి చెందిన కారులో ఈవీఎంను గుర్తించిన స్థానికులు ఆ వాహనంపై దాడి చేశారు. దీంతో ఎన్నికల సంఘం దర్యాప్తుకు ఆదేశించింది. అయితే తాము ఎక్కిన వాహనం బీజేపీ నేతకు సంబంధించిన వాహనమని తమకు తెలియదని, ఈవీఎంలను తీసుకెళ్లే క్రమంలో తమ వాహనంలో ఇబ్బంది తలెత్తితే, అగుగా వెళ్తున్న కారును లిఫ్ట్ అడిగామని పోలింగ్ అధికారులు ఈసీకి వివరణ ఇచ్చారు. కానీ ఆ వివరణతో ఈసీ సంతృప్తి చెందలేదు. ట్రాన్స్ పోర్ట్ ప్రోటోకాల్ ను విస్మరించినందుకు వారిపై వేటేసింది.