అసెంబ్లీ ఫలితాలపై మూడు రోజుల కిందటే..!!
అహ్మదాబాద్/సిమ్లా: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిందే జరుగుతోంది. వార్ వన్ సైడ్ అయింది. భారతీయ జనత పార్టీ తిరుగులేని మెజారిటీని సాధిస్తోంది. థంపింగ్ విక్టరీని అందుకోనుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బీజేపీ దిమ్మతిరిగే స్థాయిలో అసెంబ్లీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంటోంది. కాంగ్రెస్ గానీ, ఆమ్ ఆద్మీ పార్టీ గానీ ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాయి. పూర్తిగా చేతులెత్తేశాయి. గుజరాతీయులు ఈ రెండు పార్టీలను ఘోరంగా తిరస్కరించారు. గంపగుత్తగా బీజేపీకి ఓటు వేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలన్నీ వాస్తవ రూపాన్ని దాల్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కనీసం 120 నుంచి 140 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. దీనికి మించిన ఫలితాలు వెలువడుతున్నాయి. 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్లో బీజేపీ- 150కి పైగా నియోజకవర్గాలను దక్కించుకుంటోంది. బీజేపీ ప్రభంజనం ముందు అటు కాంగ్రెస్ గానీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ గానీ నామమాత్రంగా మిగిలాయి. దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి.

హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ జోరు తగ్గింది. గుజరాత్ను క్లీన్ స్వీప్ చేసిన కమలనాథులు ఇక్కడ చతికిల పడ్డారు. అధికారాన్ని కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించే దిశగా సాగుతోంది. ఇప్పటికే- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ను దాటింది. అది బొటాబొటిగానే అయినప్పటికీ- అధికారాన్ని అందుకుంటామనే ధీమా కాంగ్రెస్ నాయకుల్లో నెలకొంది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఉన్న మొత్తం స్థానాల సంఖ్య.. 68. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 35 సీట్లు. ఈ మేజిక్ ఫిగర్ను అందుకోనుంది కాంగ్రెస్. ఆ పార్టీ అభ్యర్థులు 37 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. అధికారంలో ఉన్న బీజేపీ 29
నియోజకవర్గాల్లో లీడింగ్లో ఉన్నారు. ఇతరులు మూడు చోట్ల తమ సమీప ప్రత్యర్థులపై ఆధిక్యతను సాధించారు. తొలి గంటలో వెనుకపడిన హస్తం పార్టీ- ఆ తరువాత దూసుకొచ్చింది. బీజేపీని వెనక్కి నెట్టింది.
ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇవే తరహా ఫలితాలు వెలువడుతాయని మూడు రోజుల కిందటే ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. జాతీయ మీడియా ఛానళ్లు, సర్వే సంస్థలు సంయుక్తంగా చేపట్టిన సర్వేలన్నీ వాస్తవాన్ని ప్రతిబింబిస్తోన్నాయి. గుజరాత్లో బీజేపీ విజయం సాధిస్తుందని, ఇక్కడ కాంగ్రెస్కు గానీ, ఆమ్ ఆద్మీ పార్టీకి గానీ ఎలాంటి అవకాశం ఉంబోదంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఇప్పుడదే జరుగుతోందా రెండు రాష్ట్రాల్లో కూడా.












Click it and Unblock the Notifications