వివాహిత కామ దాహానికి ఇద్దరు బలి: భర్త హత్య, ప్రియుడు ఆత్మహత్య
మైసూరు: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా పెరుగుతున్న ఆత్మహత్యలు, హత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని ఓ వివాహిత అక్రమ సంబంధం కారణంగా ఆమె భర్తతోపాటు ప్రియుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
ఇద్దరి మరణాలకు కారణమైన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, నిందితురాలిని కఠినంగా శిక్షించాలని మృతుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
కొంత కాలం అన్యోన్యంగానే..
వివరాల్లోకి వెళితే.. హొరళళ్లి గ్రామానికి చెందిన సిద్ధరాజు అనే యువకుడితో నిందితురాలు(25)కు వివాహమైంది. కొద్ది రోజుల వరకు వీరి కాపురం అన్యోన్యంగానే సాగింది. అయితే, గత కొంత కాలంగా ఆమెకు మహాదేవ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ యువకుడితో సాన్నిహిత్యం పెంచుకుంది.
మరో యువకుడితో.. నిలదీసిన భర్తను..
ఆ యువకుడితో తన భార్య శరీరక సంబంధాన్ని కొనసాగిస్తుందనే విషయాన్ని తెలుసుకున్న సిద్ధరాజు.. ఆమెను పలుమార్లు మందలించాడు. దీంతో తమ అక్రమ బంధానికి అడ్డుపడుతున్నాడనే కారణంగా.. సిద్ధరాజును అంతమొందించాలని కుట్ర పన్నింది.
ప్రియుడితో కలిసి..
మహాదేవతో కలిసి సిద్ధరాజును చంపేందుకు ప్లాన్ వేసింది నిందితురాలు. ఈ క్రమంలో గత శనివారం మాయమాటలు చెప్పి.. సిద్ధరాజును బయటకు తీసుకెళ్లారు మహదేవ, అతని స్నేహితుడు సిద్ధప్పాజీ. ఆ తర్వాత ఇద్దరు కలిసి సిద్ధరాజును హతమార్చారు.
ఆమె నాటకం బయటపడిందిలా..
ఇక ఎవరికీ అనుమానం రాకుండా తన భర్త కనిపించడం లేదంటూ నిందితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు.. దర్యాప్తులపై భాగంగా ఆమెపైనే అనుమానం వచ్చింది. మంగళవారం ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం చెప్పింది.
చివరకు ప్రియుడూ ఆత్మహత్య
కాగా, ఈ విషయం తెలిసి ఆందోళన చెందిన మహదేవ.. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు విగతజీవిగా కనిపించాడు మహదేవ. దీంతో నిందితురాలితోపాటు సిద్ధరాజు హత్యకు సహకరించిన సిద్ధప్పాజీని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.