కారులో ఒంటరిగా ఉన్నా.. మాస్కు తప్పనిసరి: హైకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నా కూడా.. మాస్కు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తూ మాస్కు ధరించనందుకు ఢిల్లీ పోలీసులు జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ను విచారించిన జడ్జీ ప్రతిభా ఎం సింగ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు.
మీరు కారులో ఒక్కరే ఉన్నప్పటికీ.. మాస్కు ధరించడానికి ఉన్న అభ్యంతరం ఏమిటి? ఇది మీ భద్రత కోసమే. దేశంలో మహమ్మారి తీవ్రత పెరిగింది. టీకాలు తీసుకున్నా.. తీసుకోకపోయినా మాస్కులు ధరించాలని ఢిల్లీ హైకోర్టు పిటిషనర్కి స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు చేసిన సూచనలు ప్రస్తావించింది. కరోనా నుంచి రక్షణ పొందడానికి ఎవరైనా చేయగలిగేది ఇదేనని కోర్టు వ్యాఖ్యానించారు.
కారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు, డ్రైవర తరచూ కిటికీ(డోర్ గ్లాస్)ని తీయాల్సి రావొచ్చు. కరోనావైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆ సమయంలో ఎవరికైనా వ్యాధి సోకే అవకాశం ఉంటుందని హైకోర్టు వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రజలు మాస్కులు ధరించడానికే ఢిల్లీ ప్రభుత్వం కూడా మొగ్గుచూపింది.
కరోనా కేసులు దేశ రాజధానిలో మళ్లీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, కారులో ఒంటరిగా ప్రయాణిస్తోన్న వ్యక్తి మాస్కు ధరించాలనే నిబంధన ఏదీ లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది. అయితే, కరోనా కట్టడికి రాష్ట్రాలు సొంతంగా నియమాలు రూపొందించి, అమలు చేసుకునే హక్కు ఉందని పేర్కొంది.
ఢిల్లీలో మొత్తం 6,85,062 కరోనా కేసులుండగా, 6,56,617 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి 11,113 మంది మరణించారు. ప్రస్తుం ఢిల్లీలో 17,332 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.