Fact Check: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల వేతనాల్లో 30శాతం కోతంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత..?
న్యూఢిల్లీ: కరోనావైరస్ పై సోషల్ మీడియాలో చాలా వదంతులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వదంతులను నమ్మి పలువురు నష్టాలు కోరి తెచ్చుకున్నారు కూడా. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను లేదా వదంతులను నమ్మొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వం సూచించిన విధానాలనే పాటించాలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇక తప్పుడు వార్తలపై కూడా ప్రభుత్వం నిఘా పెంచింది. అవాస్తవాలను అదే పనిగా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలకు దిగుతోంది ప్రభుత్వం.
కరోనావైరస్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది: ఆ జంతువులపై సక్సెస్, ఈ ఏడాదిలోనే...!
తాజాగా ఓ న్యూస్ ఛానెల్లో ఓ వార్త ప్రసారమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు వేతనాల్లో 30శాతం కోత విధిస్తున్నట్లు ఓ వార్త టెలికాస్ట్ అయ్యింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం అయినట్లుగా ఆ వార్త ప్రసారమైంది. గ్రేడ్ల వారీగా వేతనాల్లో కోత ఉంటుందంటూ వార్త ప్రసామైంది. ఇందులో గ్రేడ్ -డీ కిందకు వచ్చే ఉద్యోగస్తుల వేతనాల్లో ఎలాంటి కోతలు ఉండవని ఆ వార్తా ఛానెల్ న్యూస్ టెలికాస్ట్ చేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టమైన ప్రకటన చేసింది. అలాంటి ప్రతిపాదనలు ఏవీ ప్రభుత్వం వద్ద లేవని వెల్లడించింది అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల వేతనాల్లో కోత విధిస్తున్నామంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది. అ వార్తలన్నీ అవాస్తవాలే అని పేర్కొంది.
అంతకుముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్ల జీతాల్లో 30శాతం కోత విధించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తపై కూడా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అలాంటి వార్తలు నిర్థారించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఆదేశాలు లేవు. కనీసం మీడియా ప్రకటన కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో ఇది అవాస్తవమని తేలింది. ఆ తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వార్తపై ఏప్రిల్ 9వ తేదీన స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 30శాతం కోత విధిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పీఐబీ నిర్థారించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.