ఒకే కుటుంబంలో నలుగురి దారుణహత్య: బాలికపై గ్యాంగ్రేప్: పదేళ్ల బాలుడి సహా
లక్నో: ఉత్తర ప్రదేశ్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణహత్యకు గురయ్యారు. భార్య, భర్త వారి ఇద్దరు పిల్లలను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. హత్యాకాండలో ప్రాణాలను కోల్పోయిన వారిలో ఆ దంపతుల 16 సంవత్సరాల కుమార్తె, 10 సంవత్సరాల బాలుడు ఉన్నారు. హత్య చేయడానికి ముందు- బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

11 మందిపై ఎఫ్ఐఆర్..
ఈ హత్యకు గురైన కుటుంబం షెడ్యూల్డ్ తెగలకు చెందినది కావడం వల్ల రాజకీయ వేడి రగిలింది. ఇందులో అగ్రవర్ణాల ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తోన్నాయి. ఈ కుటుంబం నివాసం ఉంటోన్న ప్రాంతానికే చెందిన కొందరు అగ్రవర్ణాల వారు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని మృతుల బంధువులు మండిపడుతున్నారు. కొందరు అనుమానితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసును నమోదు చేశారు. 11 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు.

కుటుంబం మొత్తం..
ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్రాజ్ జిల్లా సొరాన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గొహారి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైన వారిని ఫూల్చంద్, ఆయన భార్య మీను, కుమార్తె షామీ, కుమారుడు శివ్గా గుర్తించారు. తొలుత స్థానికులు ఈ ఉదయం వారి నివాసంలో నలుగురి మృతదేహాలను గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

బాలికపై గ్యాంగ్రేప్..
బాలిక మృతదేహం ఇంట్లో లభించగా.. మిగిలిన ముగ్గురివి ఆవరణలో కనిపించాయి. తొలుత ముగ్గురిని హతమార్చిన తరువాత.. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి- బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఉంటారని, అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే గ్రామంలో నివసిస్తోన్న ఓ అగ్ర వర్ణాలకు చెందిన కుటుంబంతో కొంతకాలంగా ఫూల్చంద్కు భూ తగాదాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదివరకు ఫూల్చంద్ కుటుంబంపై దాడి సైతం జరిగిందని చెబుతున్నారు.

శరీరాలపై తీవ్ర గాయాలు..
బాలిక శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యాచారం చేసినట్లు ఆనవాళ్లు లభించాయని పేర్కొన్నారు. గ్యాంగ్ రేప్, హత్య కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పదునైన ఆయుధంతో నలుగురిపై దాడికి పాల్పడ్డారని, అనంతరం హత్య చేసి ఉంటారని పేర్కొన్నారు. మృతుల శరీరాలపై అత్యంత తీవ్రమైన గాయాలున్నాయని చెప్పారు.

పరామర్శించనున్న ప్రియాంకా గాంధీ..
కాగా- ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవ్వాళే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా.. ప్రయాగ్రాజ్లో పర్యటించాల్సి ఉంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఆమె ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. అదే రోజు ఈ దారుణం చోటుచేసుకోవడం పట్ల ఆమె దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఫూల్చంద్ బంధుమిత్రులను ఆమె పరామర్శిస్తారని ప్రయాగ్ రాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు. ఆ తరువాతే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని అన్నారు.

ఆటవిక రాజ్యం..
బీజేపీ ప్రభుత్వ హయాంలో నిమ్న కులాలవారిపై అగ్రవర్ణాల భౌతికదాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయంటూ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్లో ఆటవిక రాజ్యం నడుస్తోందనడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదని చెబుతున్నారు. ఇదివరకు లఖింపూర్ ఖేరీలో చోటు చేసుకున్న ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. దళితులు, షెడ్యూల్డ్ తెగలవారు, రైతులకు యూపీలో రక్షణ లేకుండా పోయిందంటూ కాంగ్రెస్ నాయకులు భగ్గుమంటున్నారు.












Click it and Unblock the Notifications