బంగాళాఖాతంలో బలపడుతున్న ఫణి తుఫాను...ఈ ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఫణి తుఫాను క్రమంగా బలపడుతోంది. దీంతో రానున్న 24 గంటల్లో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తుఫాను వాయువ్య దిశగా గంటకు 16కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఏప్రిల్ 30 తర్వాత ఈశాన్యంలో దిశ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారంతో ఫణి తుఫాను చెన్నైకి ఆగ్నేయ దిశలో 1050 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంకు 1230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే తమిళనాడుకు తుఫాను ముప్పు పెద్దగా ఉండకపోవచ్చునని ఆ రాష్ట్ర వాతావరణ కేంద్రం తెలిపింది. ఫణి తుఫాను తమిళనాడు తీరం దాటే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మే 3నాటికల్లా తుఫాను మరింత బలపడి ఒడిషాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. తుఫాను ముంచుకొస్తున్నందున అధికారులు, ప్రభుత్వ యంత్రాంగా అలర్ట్గా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఒడిషా సర్కార్. ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా పునరావాస కేంద్రాలను, కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటును సమీక్షించాలని ఆదేశించింది.
ఉత్తర శ్రీలంక తీరం వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.అయితే ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. ఫణి తుఫాను కారణంగా గాలులు బలంగా వీచే అవకాశం ఉన్నట్లు వెదర్ డిపార్ట్మెంట్ తెలపింది. నైరుతీ బంగాళాఖాతంలో గాలులు గంటకు 175 కిలోమీటర్లు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీనివల్ల పుదుచ్చేరి, ఏపీలోని దక్షిణకోస్తా ప్రాంతాలు అప్రమత్తతతో ఉండాలని అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్, ఒడిషా తమిళనాడులో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఈ సమయంలో చేపలవేటకు సముంద్రంలోకి వెళ్లరాదని ఆదేశాలు జారీచేసింది.