"తుంగా పాణం.. గంగా స్నానం.." దక్షిణాది రాష్ట్రాల సరికొత్త ఐక్యత!
దక్షిణ భారతదేశానికి అన్నపూర్ణగా, మూడు రాష్ట్రాల లక్షలాది ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలిచిన ప్రఖ్యాత తుంగభద్ర డ్యామ్ 73 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఒక అత్యంత అరుదైన, సువర్ణ ఘట్టం ఆవిష్కృతమైంది. కర్ణాటకలోని విజయనగర జిల్లా హోసపేట వేదికగా.. తుంగభద్ర ప్రాజెక్టుకు రూ.51 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించిన 33 కొత్త స్పీల్ వే గేట్లను (క్రస్ట్ గేట్లు) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఉమ్మడిగా ప్రారంభించారు. ఏపీ తరఫున మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ కూడా ఈ చారిత్రాత్మక వేడుకలో పాల్గొన్నారు. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం నేతలంతా హోసపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు తరలివచ్చారు.
నాడు విపత్తు.. నేడు పునరుజ్జీవం
బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మార్క్ ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. "తుంగా పాణం.. గంగా స్నానం" అనే సామెతను గుర్తు చేస్తూ తుంగభద్ర నది పవిత్రతను కొనియాడారు. 2024 ఆగస్టులో వచ్చిన భారీ వరదలకు 19వ నంబర్ గేటు కొట్టుకుపోయినప్పుడు.. నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలో రికార్డు సమయంలో తాత్కాలిక 'స్టాప్లాక్' గేటును అమర్చి అపారమైన జల వృధాను అడ్డుకున్నామని గుర్తుచేశారు. ఆ తర్వాత ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత సమన్వయంతో పనిచేసి కేవలం 6 నెలల రికార్డు కాలంలోనే మొత్తం 33 క్రెస్ట్ గేట్లను పునరుద్ధరించి, రైతుల ప్రయోజనాలను కాపాడామని హర్షం వ్యక్తం చేశారు. విజయనగర సామ్రాజ్యానికి, హంపీకి సహజ రక్షణ కవచంగా నిలిచిన ఈ నదీతీరానే జోగులాంబ, హంపీ విరూపాక్ష ఆలయం, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం వంటి పుణ్యక్షేత్రాలు వెలిశాయని పేర్కొన్నారు.

ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు.. ఇదొక చరిత్ర
గత చరిత్రను గుర్తుచేస్తూ.. 1983లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో పాటు నలుగురు దక్షిణాది ముఖ్యమంత్రులు కలిసి తమిళనాడుకు (చెన్నై తాగునీటి కోసం) 15 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, మళ్లీ ఇన్నాళ్లకు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ముగ్గురు ముఖ్యమంత్రులం ఒకే వేదికపైకి రావడం ఒక అద్భుతమైన మైలురాయి అని చంద్రబాబు అభివర్ణించారు. "రాష్ట్రాలుగా మనం వేరైనా.. దేశంగా మనమంతా ఒక్కటే" అని చాటిచెబుతూ, కేంద్ర మంత్రి నేతృత్వంలో తామంతా కలిసి ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలపై సుదీర్ఘంగా చర్చించామని, దక్షిణాది రాష్ట్రాల చరిత్రలో ఈ సమావేశం నిలిచిపోతుందని స్పష్టం చేశారు.
నదుల అనుసంధానమే దేశానికి శ్రీరామరక్ష..
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ 'వన్ నేషన్ - వన్ గ్రిడ్', టెలికాం, రహదారి నెట్వర్క్లతో అగ్రగామిగా దూసుకుపోతోందని, ఇప్పుడు జలవనరుల రంగంలోనూ విప్లవాత్మక మార్పులు రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దేశంలో గంగా-కావేరి నదులను అనుసంధానిస్తే భారతదేశాన్ని ఆపడం ఎవరితరం కాదన్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో 'కెన్-బెత్వా' ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం విజయవంతమైందని.. అదే తరహాలో 'గోదావరి-కావేరి' నదులను అనుసంధానించడం ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నీటి అవసరాలు శాశ్వతంగా తీరుతాయని రోడ్ మ్యాప్ వివరించారు.
ఈ ఏడాది నీటిని పొదుపుగా వాడుకుందాం..
ప్రస్తుతం 'ఎల్ నినో' ప్రభావం కారణంగా తుంగభద్రకు, ఆల్మట్టికి ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహాలు రావడం లేదని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని రైతులకు పిలుపునిచ్చారు. ఇలాంటి సంక్షోభాలను అధిగమించడానికే.. ముందుగా రాష్ట్రాల అంతర్గత నదులను, ఆ తర్వాత అంతర్రాష్ట్ర నదులను అనుసంధానం చేసుకోవాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అందరం కలిసికట్టుగా ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగి, రైతాంగ ప్రయోజనాలను కాపాడుకుందామని సభాముఖంగా పిలుపునిచ్చారు.














Click it and Unblock the Notifications