మార్చి 26న భారత్ బంద్... దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసే ప్లాన్... మావోయిస్టుల మద్దతు...
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మార్చి 26న భారత్ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. అలాగే హోలీ పండుగ జరుపుకునే మార్చి 28న వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేసి రైతు సంఘాలు నిరసన తెలపనున్నాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్తో గతేడాది డిసెంబర్లోనూ రైతు సంఘాలు దేశవ్యాప్త బంద్కు పిలుపునివ్వడం... అది విజయవంతమవడం తెలిసిందే. తాజా బంద్తో దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని రైతు సంఘాలు భావిస్తున్నాయి.
మార్చి 26వ తేదీన ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు బంద్ నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. ఇప్పటికే బంద్కు అన్ని ట్రేడ్,టాన్స్పోర్ట్ యూనియన్లు,పలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. తాజాగా మావోయిస్ట్ పార్టీ కూడా భారత్ బంద్కు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. అన్ని వర్గాలు బంద్కు మద్దతు తెలపాలని మావోయిస్ట్ పార్టీ ఆ ప్రకటనలో కోరింది.

ఆనాడు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రైతాంగమే ముందు వరుసలో ఉండి పోరాడిందని... ఇప్పుడు కూడా రైతాంగమే కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతోందని జగన్ పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ మార్కెట్లు మూతపడుతాయని చెప్పారు. కాంట్రాక్ట్ వ్యవసాయ విధానంలో ఆఖరికి రైతులు తమ భూములను కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. నోట్ల రద్దు,జీఎస్టీ,కార్మిక చట్టాల సవరణ,మీడియా స్వేచ్చపై నియంత్రణ విధానాలతో నియంతృత్వ పోకడలు అవలంభిస్తున్న మోదీ సర్కార్.... ఇప్పుడు రైతులను టార్గెట్ చేసిందన్నారు.
రైతుల భారత్ బంద్కు మద్దతుగా కార్మికులు,మేదావులు,మహిళలు,జర్నలిస్టులు అన్ని వర్గాలు కదిలిరావాలన్నారు.
రైతు ఉద్యమాన్ని ఉధృతంచేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. మండల,జిల్లా,రాష్ట్ర స్థాయిల్లో బంద్ జరుగుతుందని చెప్తున్నాయి. మార్చి 26తో రైతుల ఆందోళనలు నాలుగు నెలలకు చేరుతుండటంతో రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే కేంద్రం పలుమార్లు రైతులతో చర్చలు జరిపినప్పటికీ అవేవీ సఫలం కాని సంగతి తెలిసిందే. ఏడాదిన్నర పాటు తాత్కాలికంగా ఆ చట్టాలను పక్కనపెడుతామని కేంద్రం ప్రతిపాదించినప్పటికీ రైతులు అందుకు అంగీకరించలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ఏకైక ఎజెండాతో గత 112 రోజులుగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications