ముట్టడిలో ఢిల్లీ: వేలాదిగా తరలిన రైతన్నలు- సరిహద్దులు క్లోజ్: అటు కాక్రోచ్ ర్యాలీ
దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవంక కాక్రోచ్ జనత పార్టీ ప్రదర్శనలు, ఛలో పార్లమెంట్ ర్యాలీలు కొనసాగుతున్న ప్రస్తుత పరస్థితుల్లో ఇక వేలాదిమంది రైతులు ఢిల్లీని ముట్టడిస్తోన్నారు. నేడు భారీగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఓ భారీ ర్యాలీ నిర్వహించ తలపెట్టారు. ఇందులో పాల్గొనడానికి వేలాదిగా తరలి వస్తోన్నారు. దీంతో పంజాబ్- హర్యానా వైపు నుంచి ఢిల్లీలో ప్రవేశించే శంభు సరిహద్దులను మూసివేశారు.
భారత్- అమెరికా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతులు మరోసారి తమ నిరసన గళాన్ని విప్పారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ మార్చ్ చేపట్టారు. పంజాబ్, హర్యానాకు చెందిన వేలాది మంది రైతులు సరిహద్దులోని శంభు బోర్డర్ వద్దకు చేరుకున్నారు. దీంతో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీన్ని అడ్డుకోవడానికి పోలీసులు భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి. పటియాలా వైపు నుంచి శంభు సరిహద్దుకు చేరుకునే ప్రధాన రహదారులను మూసివేశారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు.

రైతు సంఘాల పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో రైతులు శంభు సరిహద్దుకు చేరుకుంటున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి సరిహద్దులను దాటకుండా గట్టి చర్యలు తీసుకుంటోన్నారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల దేశీయ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే అమెరికా నుంచి వ్యవసాయ, డైరీ ఉత్పత్తులు, పౌల్ట్రీ రంగానికి చెందిన సరుకులు భారత్ లోకి వెల్లువెత్తుతాయనేది వారి ఆందోళన.
#WATCH | A large number of farmers reach Shambhu Border (Punjab-Haryana border) ahead of their scheduled march to Delhi today. Visuals from Patiala (Punjab) side. pic.twitter.com/dJtdEt0qti
— ANI (@ANI) July 21, 2026
అమెరికా నుంచి వచ్చే చౌక దిగుమతుల వల్ల స్థానిక వ్యవసాయ మార్కెట్లు కుప్పకూలిపోతాయని, ఫలితంగా దేశంలోని కోట్ల మంది చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని రైతు ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించే ప్రభుత్వ రక్షణ వ్యవస్థలు ఈ అంతర్జాతీయ ఒప్పందాల వల్ల క్రమంగా బలహీనపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
కిసాన్ మజ్దూర్ మోర్చా, జాయింట్ కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ యూనియన్ వంటి పలు జాతీయ స్థాయి రైతు, రైతు కార్మిక సంఘాలు ఈ మహా ప్రదర్శనలో భాగస్వామ్యం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ పోలీసులు ట్రాపిక్ అడ్వైజరీ సైతం జారీ చేశారు. కిసాన్ ఘాట్, సత్యాగ్రహ మార్గ్, వెలోడ్రోమ్ రోడ్, రాజ్ఘాట్ డీటీసీ డిపో రోడ్, రాజ్ఘాట్ డీటీసీ బైపాస్ రోడ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలు నెమ్మదించే అవకాశం ఉంది.
పరిస్థితి తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక డీవియేషన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ గేట్, రాజ్ఘాట్ క్రాసింగ్, గురునానక్ చౌక్, శాంతివన్ చౌక్, రాజ్ఘాట్ డీటీసీ డిపో, ఐపీ ఫ్లైఓవర్ల వద్ద పోలీసులు వాహనాల ప్రయాణాన్ని మళ్లించారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని సూచించారు. ప్రయాణికులకు తక్షణ సహాయం అందించేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. 1095 లేదా 011-25844444 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. 8750871493 అనే వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ట్రాఫిక్ స్థితిగతులను తెలుసుకోవచ్చు.












Click it and Unblock the Notifications